యాప్నగరం

మా భూభాగం నుంచి వెనక్కు వెళ్లాల్సిందే.. చైనాకు భారత్ అల్టిమేటం

దాదాపు రెండు నెలలుగా భారత్, చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంభన కొనసాగుతుండగా.. తొలిసారి మే మొదటి వారంలో ఇరు సైన్యాలూ ఘర్షణకు దిగాయి. ఆ తర్వాత జూన్ 15న చైనా సైన్యం వ్యూహాత్మకంగా దాడిచేసింది.

Samayam Telugu 23 Jun 2020, 12:17 pm
సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తత కొనసాగుతున్న వేళ.. ఇరు దేశాల సైనిక జనరల్స్ మధ్య రెండో దఫా చర్చలు సోమవారం జరిగాయి. చైనా సరిహద్దువైపు చూశాల్‌లోని మోల్డో వద్ద లెఫ్టినెంట్ జనరల్స్ స్థాయి చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా తమ భూభాగం నుంచి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైన్యాలను వెనక్కు మళ్లించాలని భారత్ స్పష్టం చేసింది. తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు నుంచి చైనా సైన్యం వెళ్లిపోవాలని కోరింది. గాల్వన్ లోయ వద్ద జూన్ 15న తమ సైనికులపై ముందస్తు ప్రణాళికతోనే దాడిచేశారని సమావేశంలో భారత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
Samayam Telugu సరిహద్దు వివాదంపై భారత్, చైనా చర్చలు
Clashes between India and China


‘పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరంలో పాయింట్ 4 నుంచి 8 వరకు 8 కిలోమీటర్ల మేర ఎల్ఏసీ వెంట ఏప్రిల్ ముందు నాటికి ఉన్న యథాతథ స్థితిని పునరుద్దరించాలని డిమాండ్ చేసింది... అలాగే గాల్వన్ లోయకు ఎదురుగా ఉన్న తూర్పు లడఖ్‌లోని గోగ్రా-హాట్‌స్ప్రింగ్స్, దెప్సాంగ్, చుశుల్ వద్ద సైనిక నిర్మాణాలను నిలిపివేయాలని కోరింది’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

చుశుల్ వద్ద జరిగిన ఈ చర్చల్లో భారత్ తరఫున 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా తరఫున దక్షిన జియాంగ్ మిలటరీ డిస్ట్రిక్ట్ చీఫ్ మేజర్ జనరల్ లియూ లిన్ పాల్గొన్నారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ చర్చలు రాత్రి 10.30 గంటలకు వరకు కొనసాగాయి. 11 గంటలపాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి.

అయితే, చర్చల సారాంశం మాత్రం అధికారులు వెల్లడించలేదు. ‘లడఖ్‌లో ఉద్రిక్తతను తగ్గించడం అంత సులభం కాదు.. మరికొంత సమయం పడుతుంది.. చర్చలు ఫలప్రదమవుతాయని ఆశిస్తున్నాం.. కానీ, ఏ పరిస్థితిని ఎదుర్కోడానికైనా సిద్ధంగా ఉన్నాం’ అని అధికార వర్గాలు వ్యాఖ్యానించాయి. భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం పెరుగుతోంది. వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు వేడెక్కుతున్నాయి. తాజాగా భారత్‌, చైనా బలగాలు పెద్ద ఎత్తున చేరాయి. ఇరు వైపుల వెయ్యిమందికి పైగా బలగాలు మోహరించినట్లు సమాచారం.

చైనా నుంచి ఎటువంటి దాడులు జరిగినా సమర్ధంగా అడ్డుకునేందకు తనకున్న అన్ని అవకాశాలను భారత్ పరిశీలిస్తోంది. పాంగాంగ్‌ టీఎస్‌వో నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లిపోయేలా స్పెషల్‌ ఆపరేషన్‌‌కు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఫింగర్‌ 4 ప్రాంతం వద్ద పరిస్థితి భారత్‌ అదుపులోనే ఉంది. ఆ ప్రాంతంలో చైనా భారీగా దళాలను మోహరిస్తుండగా, అదే స్థాయిలో భారత్‌ తన సైనికులను రంగంలోకి దించుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.