యాప్నగరం

మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా భారత్: సర్వే

మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉందని రాయిటర్స్ ఫౌండేషన్ తెలిపింది.

Samayam Telugu 26 Jun 2018, 12:53 pm
మన దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోతోందని థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో వెల్లడైంది. మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉందని రాయిటర్స్ ఫౌండేషన్ తెలిపింది. నిత్యం యుద్ధ వాతావరణంతో అట్టుడుకే అప్ఘాన్, సిరియా దేశాలు రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. సోమాలియా, సౌదీ అరేబియా వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. మహిళల పాలిట ప్రమాదకరమైన తొలి పది దేశాల్లో తొమ్మిది ఆసియాకు చెందినవే కావడం గమనార్హం. ఈ జాబితాలో అమెరికా పదో స్థానంలో నిలిచింది.
Samayam Telugu Reuters_Survey


భారత్‌లోని మహిళలు ఎక్కువగా లైంగిక హింసకు గురవుతున్నట్టు నివేదిక వెల్లడించింది. మన దేశంలో అమ్మాయిలను అపహరించేందుకు అవకాశాలు ఎక్కువని.. దీన్ని కట్టడి చేయడంలో చట్టాలు, న్యాయ వ్యవస్థ విఫలం అయ్యాయని రాయిటర్స్ నివేదిక పేర్కొంది.

భారత్‌లో అమ్మాయిలను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవడం, సెక్స్ బానిసలుగా మార్చేయడం, పనుల్లో చేర్చడం లాంటి కార్యకలాపాలు ఎక్కువని సర్వే తేల్చింది. దేశంలో స్త్రీల భద్రత గతంలో ఎన్నడూ లేని రీతిలో అట్టడుగు స్థాయికి చేరిందని రాయిటర్స్ తెలిపింది. ఏడేళ్ల క్రితం నిర్వహించిన సర్వేలో భారత్ నాలుగో స్థానంలో ఉంది.

2030 నాటికి మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న హింసను పూర్తిగా అరికట్టాలని స్వేచ్ఛగా బతికేలా వారికి అవకాశం కల్పించాలని మూడేళ్ల క్రితం ప్రపంచ దేశాల నేతలు ప్రతిన బూనారు. కానీ ప్రపంచంలోని ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ జీవితంలో ఏదో ఒక సందర్భంలో లైంగిక వేధింపులకు గురవుతున్నారని రాయిటర్స్ అధ్యయనంలో వెల్లడైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.