యాప్నగరం

మోదీ ప్రభుత్వ మరో కీలక నిర్ణయం..

నరేంద్ర మోదీ ప్రభుత్వ నూతన ఒరవడుల్లో మరో అంశం చేరింది. 2018 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏసియాన్‌కు చెందిన 10 దేశాల అధినేతలనూ ఒకేసారి..

TNN 8 Jul 2017, 12:52 pm
నరేంద్ర మోదీ ప్రభుత్వ నూతన ఒరవడుల్లో మరో అంశం చేరింది. 2018 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏసియాన్‌కు చెందిన 10 దేశాల అధినేతలనూ ఒకేసారి ఆహ్వానించడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకూ ఈ వేడుకలకు ఏదో ఒక దేశానికి చెందిన నేతను మాత్రమే ముఖ్య అతిథిగా పిలవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ పద్ధతిని మరింత ముందుకు తీసుకెళుతూ మోదీ ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీ‌కారం చుడుతోంది. అసోషియేషన్ ఆఫ్ సౌత్‌ఈస్ట్ ఏసియన్ నేషన్స్ (ASEAN)లో సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం, బ్రూనై, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిఫ్సీన్స్ దేశాలు సభ్యులుగా ఉన్నాయి. భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ దేశాధినేతలందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి కొత్త చరిత్ర లిఖించడానికి మోదీ ప్రభుత్వం సంకల్పించింది. అదే జరిగితే ఈ వేడుకల్లో ఒకరి కంటే ఎక్కువ మంది ప్రపంచ నేతలు పాల్గొనడం ఇదే తొలిసారి అవుతుంది.
Samayam Telugu india to invite heads of 10 asean nations for republic day celebrations
మోదీ ప్రభుత్వ మరో కీలక నిర్ణయం..


నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరిన నాటి నుంచి పొరుగు దేశాలతో సంబంధాల బలోపేతం కోసం కీలక చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఆసియా దేశాలతో సత్సంబంధాల కోసం అంతకు ముందు ప్రారంభించిన ‘లుక్ ఈస్ట్’ విధానం పేరును 2014లో మోదీ ప్రభుత్వం ‘యాక్ట్ ఈస్ట్’గా పునర్నిర్వచించింది. కేవలం పేరు మార్చడంతోనే సరి పెట్టకుండా ఈ దిశగా కీలక చర్యలు చేపట్టింది. ఈ దిశగా తాజా నిర్ణయాన్ని గొప్ప ముందడుగుగా పేర్కొనవచ్చు.

ఏసియాన్ దేశాలతో ఆర్థికంగా, రక్షణ వ్యవహారాల పరంగా మరిన్ని ఒప్పందాలు చేసుకోనున్నట్లు విదేశాంగ మంత్రి షుష్మా స్వరాజ్ ఇంతకుముందే ప్రకటించారు. వాణిజ్య సంబంధాల కోసం ఉమ్మడి వేదికను నిర్మించడానికి కూడా చర్యలు చేపట్టారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 40 శాతం వాటా ఉన్న ఈ దేశాలు ఒకే వేదికపైకి వస్తే పరస్పర అభివృద్ధి విషయంలో భారీ ముందడుగు పడుతుంది. రక్షణ వ్యవహారాల్లోనూ ఉమ్మడి సహకారం దిశగా విశేష కృషి జరుగుతోంది.

ఏసియాన్ 25వ వడిలో అడుగు పెడుతోన్న సందర్భంగా వచ్చే ఏడాది కీలక భేటీలు కూడా ఉంటాయని విదేశాంగ వర్గాల సమాచారం. ఈ దేశాల్లో భౌగోళికంగా చాలా అంశాల్లో సారూప్యాలున్నాయని, అలాంటి అన్ని అంశాల్లో భారత్‌తో కలసి పనిచేయడానికి ఆయా దేశాలు ఆసక్తి చూపుతున్నాయని అధికారులు వెల్లడించారు. సముద్ర జలాల్లోనూ ఉమ్మడి ప్రయోజనాలకు వినియోగించుకునే విధంగా కొంత విస్తీర్ణాన్ని కేటాయించుకొని, పరస్పర ప్రయోజనాలు పొందేవిధంగా చర్యలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ చర్యలన్నింటి ద్వారా చైనా దూకుడుకు కూడా కళ్లెం వేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.