యాప్నగరం

భారతీయులంతా తక్షణమే ఉక్రెయిన్‌ను వీడండి.. భారత్ కీలక ప్రకటన

ఉక్రెయిన్‌ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. రష్యా ఓ వైపు దౌత్య మార్గాల్ని అనుసరిస్తూనే.. మరోవైపు ఉక్రెయిన్‌ సరిహద్దులో సైనిక ఒత్తిడిని కొనసాగిస్తోంది. పశ్చిమ దేశాలతో మరిన్ని చర్చలకు సిద్ధమన్న సంకేతాలూ ఇస్తోంది. ప్రస్తుతం బెలారస్‌తో రష్యా యుద్ధవిన్యాసాలు నిర్వహిస్తోంది. ఇవి వచ్చే ఆదివారం వరకూ కొనసాగుతాయి. ఈ విన్యాసాల ముసుగులో ఉత్తర దిక్కు నుంచి రష్యా దాడికి యత్నించొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, వీటిని పుతిన్‌ సర్కారు కొట్టిపారేస్తోంది.

Samayam Telugu 15 Feb 2022, 1:13 pm

ప్రధానాంశాలు:

  • ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ కీలక ప్రకటన.
  • యుద్ధం భయంతో స్వదేశాలకు తరలింపు.
  • ఉద్రిక్తతలు చల్లార్చే దిశగా పలు ప్రయత్నాలు.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ఉక్రెయిన్
A view of Ukraine's national flag waves above the capital with the Motherland Monument on the right in Kyiv on Sunday.
ఉక్రెయిన్‌పై రష్యా ఎప్పుడైనా సైనిక చర్యకు దిగొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతను దృష్టిలో ఉంచుకుని ఉక్రెయిన్‌లోని తమ పౌరులను వెనక్కు వచ్చేయాలని అమెరికా సహా పలు దేశాలు విజ్ఞ‌ప్తి చేశాయి. తాజాగా, భారత్ సైతం ఉక్రెయిన్‌లోని భారతీయులు తాత్కాలికంగా వెనక్కు వచ్చేయాలని ప్రకటించింది. ఉక్రెయిన్‌లో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు ముఖ్యంగా అక్కడ ఉండాల్సిన అవసరం లేని విద్యార్థులు తక్షణమే స్వదేశానికి వచ్చేయాలని కివ్‌లోని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
‘‘ఉక్రెయిన్‌లో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు ముఖ్యంగా అక్కడ ఉండాల్సిన అవసరం లేని విద్యార్థులు తక్షణమే స్వదేశానికి వచ్చేయాలి.. అలాగే, ప్రస్తుతం ఏ ప్రాంతాల్లో ఉన్నారో తక్షణమే రాయబార కార్యాలయానికి సమాచారం అందజేయాలి’’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరడంతో పలు దేశాలు తమ దౌత్య సిబ్బందిని వెనక్కు తీసుకొస్తున్నాయి. అలాగే, పౌరుల కూడా ట్రావెల్ అడ్వైజరీ జారీచేశాయి.

అమెరికా, జర్మనీ, ఇటలీ, బ్రిటన్, ఇర్లాండ్, బెల్జియం, లగ్జెంబర్గ్, నెదర్లాండ్స్, కెనడా, నార్వే, ఎస్తోనియా, లిథ్వేనియా, బల్గేరియా, స్లొవేనియా, ఆస్ట్రేలియా, జపాన్, ఇజ్రాయేల్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాలు ఉక్రెయిన్‌లోని తమ పౌరులను వెనక్కు వచ్చేయాలని సూచించాయి. అయితే, దాడి చేసే ఉద్దేశం తమకు లేదని రష్యా కొట్టిపారేస్తున్నా.. పరిణామాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని క్రిమియాను 2014లో ఆక్రమించుకున్న రష్యా.. దోన్‌బాస్ ప్రాంతంలో వేర్పాటువాదులకు మద్దతునిస్తోంది.

ఉక్రెయిన్‌కు సరిహద్దుల్లోకి గత రెండు రోజులుగా మరిన్ని బలగాలను రష్యా తరలించింది. బెలారస్, క్రిమియా, పశ్చిమ రష్యా సరిహద్దుల్లో లక్షన్నరకుపైగా సైనికులను మోహరించింది. ఆ ప్రాంతంలో యుద్ధ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థలు, శతఘ్నులతో పాటు సైన్యాలను భారీగా సన్నద్ధం చేస్తున్నట్టు తాజాగా ఉపగ్రహ ఫోటోలు వెల్లడించాయి.

ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యా సైనిక మోహరింపులు 1.30 లక్షలకు చేరినట్లు అమెరికా పేర్కొంది. మెరుపుదాడికి అవసరమైన ఏర్పాట్లను రష్యా చేసుకుందని అగ్రరాజ్యం తెలిపింది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గెయ్‌ లవ్రోవ్‌లు సోమవారం ఒక కీలక సమావేశం నిర్వహించారు. తమ భద్రత డిమాండ్లపై పశ్చిమ దేశాలతో చర్చలను కొనసాగించాలని లవ్రోవ్‌.. ఈ సందర్భంగా అధ్యక్షుడు పుతిన్‌కు సూచించారు. ఉక్రెయిన్‌, మాజీ సోవియట్‌ దేశాలను నాటోలో చేర్చుకోబోమని హామీ ఇవ్వాలని రష్యా డిమాండ్ చేస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.