యాప్నగరం

దేశంలో లక్ష దాటిన కోవిడ్ మరణాలు.. ప్రపంచంలో మూడో దేశంగా భారత్

భారత్‌లో తొలి కరోనా కేసు జనవరి 30 నమోదుకాగా.. మార్చి 12న కర్ణాటకలో తొలి మరణం సంభవించింది. అప్పటి నుంచి మహమ్మారి బారినపడి ప్రాాణాలు కోల్పోయినవారి సంఖ్య లక్ష దాటింది.

Samayam Telugu 3 Oct 2020, 3:21 pm
దేశంలో కరోనా వైరస్ కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. అయితే, రికవరీ రేటు ఎక్కువగా ఉండటం కొంత ఊరట కలిగించే అంశం. తాజాగా దేశంలో మరణాల సంఖ్య లక్ష దాటింది. గత 24 గంటల్లో 1069 మంది కరోనా వైరస్ బలికాగా.. దేశంలో మొత్తం ఇప్పటి వరకు 1,00,842 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో లక్షకుపైగా కోవిడ్ మరణాలు నమోదైన మూడో దేశంగా భారత్‌ నిలిచింది. అమెరికా (2,08,690), బ్రెజిల్‌ (1,44,680) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. కరోనా కేసుల్లో మాత్రం ప్రపంచంలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. దేశంలో ఇప్పటి వరకూ 64,73,545 మంది వైరస్ బారినపడ్డారు.
Samayam Telugu కరోనా మరణాలు


మొత్తం 73 లక్షల కేసులతో అమెరికా తొలి స్థానంలో ఉండగా.. భారత్‌ తర్వాతి స్థానంలో బ్రెజిల్ (48 లక్షలు) నిలిచింది. దేశంలో రికవరీ రేటు 83.84 శాతంగా, మరణాల రేటు 1.56 శాతంగా ఉంది. ఇప్పటి వరకు ప్రపంచంలో 3.48 కోట్ల మంది వైరస్ బారినపడగా.. 10.33 లక్షల మంది కరోనాకు బలయ్యారు. అంటే ప్రపంచంలోని ప్రతి 10 మరణాల్లో ఒకటి భారత్‌లో చోటుచేసుకుంది. దేశంలో సంభవించిన మొత్తం మరణాల్లో దాదాపు 64 శాతం ఆగస్టు, సెప్టెంబరుల్లోనే చోటుచేసుకోవడం గమనార్హం.

భారత్‌లో మరణాల రేటు1.56 శాతం కాగా.. ప్రపంచ సగటులో ఇది సగం (2.98%) మాత్రమే. అమెరికాలో 2.84 శాతం, బ్రెజిల్ 2.99శాతంగా ఉంది. ఇక, సెప్టెంబరు తొలివారం నుంచి భారత్‌లో కరోనా మరణాలు ఎక్కడా లేనివిధంగా చోటుచేసుకుంటున్నాయి. గత కొద్ది వారాల నుంచి సగటున రోజుకు 1,065 మంది ప్రాణాలు కోల్పోతే.. ఇదే సమయంలో అమెరికా 755, బ్రెజిల్‌ 713 మంది చొప్పున చనిపోయారు. గతవారం ప్రపంచంలోని ప్రతి ఐదు కోవిడ్ మరణాల్లో ఒకటి భారత్‌లో చోటుచేసుకుంది.

దేశంలో తొలి కరోనా మరణం మార్చి 12 న చోటుచేసుకోగా.. 204 రోజుల్లో లక్ష దాటింది. తొలి 25,000 వేల మరణాలు 127 రోజుల్లోనూ (మార్చి 12-జులై 16 వరకు), మరో 30 రోజుల్లో 50వేలు (ఆగస్టు 15), మరో 25 రోజుల్లో 75వేలు (సెప్టెంబరు 9), అక్కడ నుంచి 23 రోజుల్లో లక్షకు చేరాయి. గత 28 రోజుల నుంచి రోజుకు సగటున 1,000 మంది చనిపోతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.