యాప్నగరం

ఆర్టికల్ 370 రద్దు ఏకపక్ష నిర్ణయం.. భారత్‌పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన చైనా

గతేడాది ఆగస్టులో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను భారత్ రద్దుచేసి, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే.

Samayam Telugu 6 Aug 2020, 7:31 am
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను భారత్ గతేడాది రద్దుచేసిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దుచేసి ఏడాది పూర్తయిన నేపథ్యంలో భారత్‌పై మరోసారి డ్రాగన్ తన అక్కసు వెళ్లగక్కింది. భారత్ తప్పుడు నిర్ణయం తీసుకుందని, ఇది చెల్లుబాటు కాదని వ్యాఖ్యనించింది. జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం ఏకపక్ష నిర్ణయమని, కశ్మీర్ అంశంపై చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సన్నాయి నొక్కులు నొక్కింది.
Samayam Telugu భారత్‌పై చైనా విమర్శలు
India China Relations


‘కశ్మీర్‌‌లోని పరిస్థితులను చైనా నిశితంగా పరిశీలిస్తోంది.. మా నిర్ణయం ఏంటనేది ఇప్పటికే స్పష్టం చేశాం. ఇది భారత్-పాక్‌ మధ్య ఎంతో కాలంగా ఉన్న వివాదం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలకు, భారత్-పాక్‌ల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం ఇది. ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం చెల్లుబాటు కాదు. ఈ సమస్యను ఇరు వర్గాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ బుధవారం వ్యాఖ్యానించారు.

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు విషయంలో మీ వైఖరి మారిందా? అంటూ పాకిస్థాన్ మీడియా అడిగిన ప్రశ్నకు చైనా విదేశాంగ శాఖ మంత్రి ఈ సమాధానం ఇచ్చారు. అయితే, చైనా వ్యాఖ్యలకు భారత్ దీటుగానే బదులిచ్చింది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలపై మాట్లాడే హక్కు లేదంటూ చురకలంటించింది.

విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. భారత భూభాగం గురించి చైనా అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను గమనించామని అన్నారు. ఈ విషయంలో చైనా వైఖరితో ఎటువంటి సంబంధం లేదు.. కానీ, ఇతర దేశాల అంతర్గ వ్యవహారాలపై మాట్లాడటం మానుకోవాలని సలహా ఇస్తున్నామని అన్నారు.

గతేడాది లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా భారత్ ప్రకటించడంపై చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే, చైనా ఆక్రమించుకున్ని ఆక్సాయ్‌చిన్‌ తమ భూభాగమని, మా ప్రాదేశిక సార్వభౌమాధికారాన్ని భారత్ గౌరవించాలని డ్రాగన్ పేర్కొంది. కానీ, చైనా వాదనను తోసిపుచ్చిన భారత్.. ఆక్సాయ్‌చిన్‌ లడఖ్‌లో భాగమని స్పష్టం చేసింది. అంతేకాదు, లడఖ్‌ను కేంద్ర ప్రాంత పాలితంగా ప్రకటించడం తమ అంతర్గత వ్యవహారమని వెల్లడించింది. ఇదిలా ఉండగా.. బుధవారం నాటి ప్రకటనలో లడఖ్‌ను చైనా అధికార ప్రతినిధి ప్రస్తావించలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.