యాప్నగరం

మైసూరు రాజకుటుంబీకులకు సుధామూర్తి సాష్టంగ నమస్కారం.. ఆమె ఫోటోపై తీవ్ర చర్చ

దేశీయ దిగ్గజ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్‌.. సామాజిక సేవలోనూ ముందుంటోంది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ పేరుతో 1996 నుంచి చారిటీ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నారాయణ మూర్తి, ఆయన సతీమణ సుధా మూర్తి ఈ ఫౌండేషన్‌ను ఏర్పాటుచేశారు. ఛైర్మపర్సన్‌గా ఉన్న సుధా మూర్తి ఎన్నో సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సమాజ సేవకురాలిగానే కాదు రచయితగా, విద్యావేత్తగా ఆమె గుర్తింపు పొందారు. అయితే, ఎందరికో మార్గదర్శిగా నిలిచిన ఆమె మైసూర్ రాజకుటుంబీలకు వంగి నమస్కరించడం చర్చకు దారితీసింది.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 28 Sep 2022, 12:53 pm

ప్రధానాంశాలు:

  • 2019లో మైసూర్ రాజా శతజయంతి ఉత్సవాలు
  • ముఖ్య అతిథిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్మన్
  • పాత ఫోటో వైరల్ కావడంతో తీవ్ర దుమారం.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu సుధామూర్తి
ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ( Infosys Foundation) ఛైర్‌పర్సన్‌, రచయిత్రి సుధా నారాయణమూర్తి (Sudha Murthy) ఫొటో సోషల్‌ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. మైసూర్ రాజకుటుంబీకులకు (Mysore Royal Family) ఆమె పాదాభివందనం చేస్తున్న ఫోటోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఆ ఫోటో మూడేళ్ల కిందటిది. 2019లో మైసూరు రాజ్య చివరి మహారాజు జయచామరాజ వడియార్‌ శత జయంతి ఉత్సవాలకు (centenary celebrations of Jayachamaraja Wadiyar) సుధామూర్తి హాజరయ్యారు. అప్పటి ఫోటో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఆ ఫోటోలో రాజకుటుంబానికి చెందిన ప్రమోద దేవి వడియార్‌ ( Pramoda Devi Wadiyar) (లేటు శ్రీకాంతదత్తా నరసింహరాజా వడియార్ భార్య )కు సుధామూర్తి వంగి నమస్కారం చేస్తున్నట్లుగా ఉంది.

అంతేకాదు, ఆ ఫొటోలో ప్రముఖ నటి బి. సరోజా దేవి కూడా కన్పిస్తున్నారు. నాటి ఫొటో ఇప్పుడు ఎందుకు వెలుగులోకి వచ్చిందో తెలియదు గానీ.. ప్రస్తుతం దీనిపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

కమ్రాన్ అనే ఓ ట్విటర్‌ యూజర్‌ ఈ ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘‘మైసూరు రాజకుటుంబీకుల ముందు వంగి సుధామూర్తి నమస్కరిస్తున్నారు... ఆమె ఎందరికో రోల్‌ మోడల్‌గా ఉంటారు. కానీ, మన దేశంలో రాజకుటుంబాలను పలకరించే సంప్రదాయం ఇంకా ఇలాగే కొనసాగుతోందా? లేదా వారి మీద గౌరవంతో ఆమె ఇలా చేశారా?’’ అని వ్యాఖ్యానించారు. అయితే, సుధామూర్తి చర్యను చాలా మంది తప్పుబడుతున్నారు. ఎంతో మందికి ఆదర్శప్రాయమైన ఆమె ఇలా రాజకుటుంబీకుల ముందు వంగి నమస్కారం చేయడం ఏమాత్రం సమంజసం కాదని అభిప్రాయపడుతున్నారు.


అయితే, కొందరు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ.. ఇతరుల పట్ల ఆమె చూపే గౌరవం అభినందనీయమని ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘సుధామూర్తి అంటే నాకు చాలా గౌరవం.. ఆమె పుస్తకాలు చాలా మంది మహిళలు ఎదగడానికి, ముందుకు సాగడానికి ప్రేరేపించాయి. రాజకుటుంబానికి ఆమె సాష్టాంగ నమస్కారం చేయడం ఒక భావోద్వేగ వ్యక్తీకరణ.. ఆమె మైసూర్ రాజకుటుంబం కంటే ఉన్నతం’’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.


‘‘అవును అది ఆమె వ్యక్తిగతమైతే ఎవరూ ప్రశ్నించలేరు.. రాజకుటుంబం చేసే దాతృత్వం లేదా ఇతర మంచి పని నుంచి ప్రయోజనం పొందే ఎవరైనా ఇలా చేస్తే అది చెల్లుబాటు అవుతుంది.. కానీ సుధా మూర్తి వంటి గొప్ప సాధకురాలు ఇలా చేయడం సరికాదు’’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు.


ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్‌‌గానే కాదు మంచి రచయితగా, విద్యావేత్తగా సుధామూర్తి గుర్తింపు పొందారు. తన భర్త నారాయణ మూర్తితో కలిసి ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌ను 1996లో ఏర్పాటుచేసి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. విద్య, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలకు ఈ ఫౌండేషన్ మద్దతుగా నిలుస్తోంది.
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.