యాప్నగరం

సరిహద్దుల్లో 200 రౌండ్ల కాల్పులు.. భారత్-చైనా మాస్కో ప్రకటనకు ముందే: ఆలస్యంగా వెలుగులోకి

దాదాపు ఐదు నెలల నుంచి భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎల్ఏసీ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ భారత్ భాభాగంలోకి చైనా చొచ్చుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలను సైన్యం అడ్డుకుంటోంది.

Samayam Telugu 16 Sep 2020, 1:12 pm
సరిహద్దుల్లోని తూర్పు లడఖ్‌లో కీలకమైన బ్లాక్‌టాప్‌ శిఖరాన్ని భారత సైన్యం స్వాధీనం చేసుకున్న తర్వాత పాంగాంగ్‌ సరస్సు వద్ద అనేక పరిణామాలు చోటుచేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఊహించని విధంగా పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలో భారత్‌ సైన్యం ఆధిపత్యం ప్రదర్శించడంతో చైనా ఆక్రోశంతో రగిలిపోయింది. దీంతో ఉత్తర తీరంలో చైనా సైన్యం మరింత దూకుడుగా వ్యవహరించడం మొదలుపెట్టింది.
Samayam Telugu భారత్-చైనా సరిహద్దులు
India China border


చుషూల్‌ సబ్‌ సెక్టార్‌లో బయటకు చెబుతున్న దానికన్నా... తీవ్రస్థాయిలోనే పాంగాంగ్‌ వద్ద కాల్పులు జరిగాయని ఓ అత్యున్నత స్థాయి అధికారి వెల్లడించినట్లు ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ఓ కథనం వెలువరించింది. భారత్‌-చైనా దళాలు పాంగాంగ్‌ సరస్సు ఉత్తరం వైపు ఉన్న ఫింగర్‌ 3-4 మధ్య ఈ ఘటన చోటుచేసుకొంది. ఈ ప్రాంతంలోని కీలకమైన శిఖరాలను స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఇరు సైన్యాలు పరస్పర హెచ్చరికలు చేసుకుని, 100-200 రౌండ్ల మేరకు గాల్లోకి కాల్పులు జరిపినట్లు ఆ అధికారి పేర్కొన్నారు.

మాస్కోలో భారత్, చైనా విదేశాంగ మంత్రులు భేటీకి ముందే ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 7న చుషూల్‌ సబ్‌సెక్టార్‌ వద్ద గాల్లోకి కాల్పులు జరిగాయని ఇరు సైన్యాలూ ప్రకటించాయి. భారత సైన్యం స్పందనకు ప్రతిస్పందనగా తామకు కాల్పులు జరిపినట్లు చైనా పేర్కొంది. అయితే, భారత్‌ మాత్రం కాల్పులు జరిపినట్లు ఎక్కడా అంగీకరించలేదు.

ఈ ఘటన ముక్పైరీ హైట్స్‌ వద్ద చోటు చేసుకొంది. చుషూల్‌ ఘటన తర్వాత పాంగాంగ్‌ సరస్సు వద్ద కాల్పులపై ఇరువర్గాలు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక్కడ దాదాపు 200 రౌండ్లు కాల్పులు జరిగాయి. ఈఘటన తర్వాత ఇరు దళాల మధ్య దూరం 500 మీటర్ల లోపుగానే ఉంది.

సరిహద్దు వివాదంపై ఉన్నతస్థాయి చర్చలకు ముందు ఇలాంటి వివాదాలను సృష్టించడం డ్రాగన్‌ ఎత్తుగడలో భాగమే. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచితే తమకు లబ్ది చేకూరుతుందనేది చైనా వ్యూహం. వాస్తవానికి ఫింగర్‌-4 నుంచి చైనా దళాలు వెనక్కి పోకపోవడంతో ఎల్‌ఏసీ లోపలే కీలకమైన శిఖరాలను సీపీఎల్ఏ ఆక్రమించుకునే అవకాశం ఇవ్వకుండా భారత్ ముందుజాగ్రత్త చర్యలు మొదలుపెట్టింది.

ఇది డ్రాగన్‌కు ఆగ్రహం తెప్పించడంతో పలు చోట్ల చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించగా పరిస్థితి అదుపుతప్పింది. ఈ ఘటన అనంతరం రష్యాలో భారత్, చైనా విదేశాంగ మంత్రులు సంయుక్త ప్రకటన విడుదల చేయడంతో పరిస్థితిలో కొంత అదుపులోకి వచ్చింది. అయినా కూడా చైనా దళాలు పాంగాంగ్‌ సరస్సు వద్ద ఆప్టికల్‌ కేబుల్స్‌ వేయడం, దళాలను తరలించడం వంటి కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.