యాప్నగరం

అటకెక్కిన ఆర్టికల్ 370, రెండుగా జమ్మూ కాశ్మీర్.. దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం

Lok Sabha | భారత దేశంలో జమ్మూ కాశ్మీర్ సంపూర్ణంగా విలీనమైంది. దశాబ్దాలుగా ఆ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 అటకెక్కింది. లోక్‌సభ ఆమోదంతో కాశ్మీర్ విభజన బిల్లు పార్లమెంట్ ఉభయసభల ఆమోదం పొందింది.

Samayam Telugu 6 Aug 2019, 8:34 pm
స్వతంత్ర భారత దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. జమ్మూ కశ్మీర్‌‌.. దేశంలో సంపూర్ణంగా విలీనమైంది. దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు -2019’కు పార్లమెంట్ ఉభయసభలు ఆమోదముద్ర వేశాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదంతో వెంటనే ఇది చట్టం రూపంలో అమల్లోకి రానుంది.
Samayam Telugu loksabha


సోమవారం రాజ్యసభలో ఆమోదం పొందిన ‘జమ్మూ కశ్మీర్ విభజన బిల్లు’పై లోక్‌సభలో మంగళవారం (ఆగస్టు 6) సుదీర్ఘ చర్చ జరిగింది. చర్చ అనంతరం నిర్వహించిన ఓటింగ్‌లో 370-70 ఓట్లతో బిల్లును సభ ఆమోదించింది. ఆ వెంటనే హర్షధ్వానాలతో సభ మార్మోగింది.

Read Also: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. జమ్మూ కశ్మీర్‌ బిల్లుకు సింథియా సపోర్ట్

దశాబ్దాలుగా కశ్మీర్ విషయంలో కొరకరాని కొయ్యలా మారిన ఆర్టికల్ 370కి లోక్‌సభ ముగింపు పలికింది. ఆర్టికల్ 370 రద్దుకు అనుకూలంగా 351 మంది సభ్యులు ఓటు వేయగా.. 72 మంది వ్యతిరేకించారు. ఒక సభ్యుడు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దుకు ఉభయ సభల ఆమోదం లభించడంతో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణానికి ముగింపు పలికినట్లైంది.

ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం, అధికారాలు రద్దయ్యాయి. ఇకపై భారత రాజ్యాంగంలోని నిబంధనలన్నీ జమ్మూ కశ్మీర్‌కు సంపూర్ణంగా వర్తించేందుకు వీలు కలిగింది. జమ్మూ కశ్మీర్‌లో స్థానికతను నిర్వచించడానికి, వారికి ప్రత్యేక హక్కులు కల్పించడానికి ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఇచ్చిన ఆర్టికల్ 35ఎ కూడా ఈ చర్యతో అటకెక్కింది.

జమ్మూ కాశ్మీర్‌లో కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ.. దశాబ్దాలుగా నలుగుతున్న కశ్మీర్‌ అంశంపై మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండుగా విభజించింది. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలకు కేవలం 36 గంటల్లో ముగింపు పలికింది.

పునర్‌వ్యవస్థీకరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడంతో.. జమ్మూ కశ్మీర్‌ ప్రాంతం రెండు ప్రాంతాలుగా విడిపోయింది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లఢక్ శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడ్డాయి. బిల్లు ఆమోదం పొందిన వెంటనే లోక్‌సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.