యాప్నగరం

Bihar Politics: నితీశ్ ఎఫెక్ట్‌తో బీజేపీకి ఇబ్బందేనా..? 2024లో పరిస్థితి మారుతుందా?

Bihar Politics: బిహార్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. మహారాష్ట్ర పరిణామాల నేపథ్యంలో బీజేపీ తీరుపై అనుమానాలతో నితీశ్ కుమార్ మనసు మార్చుకున్నారు. ఆర్జేడీతో టచ్‌లోకి వెళ్లిన ఆయన.. బీజేపీకి దూరమయ్యారు. నితీశ్ నిర్ణయంతో 2024లో బీజేపీకి బిహార్లో ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019లో బిహార్లో ఎన్డీయే కూటమి 39 సీట్లు గెలవగా.. వచ్చేసారి కమలం పార్టీ గెలిచే సీట్లపై జేడీయూ నిర్ణయం ప్రభావం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Authored byరవి కుమార్ | Samayam Telugu 10 Aug 2022, 1:19 pm

ప్రధానాంశాలు:

  • బిహార్లో వేగంగా మారిన రాజకీయ పరిణామాలు
  • ఆర్జేడీతో జత కట్టిన నితీశ్ కుమార్
  • జేడీయూ నిర్ణయంతో 2024లో బీజేపీకి సీట్లు తగ్గే అవకాశం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Nitish Kumar
Nitish Kumar
Bihar Politics: బీజేపీతో జేడీయూ స్నేహబంధాన్ని తెంచుకుంది. ఎన్డీయే నుంచి బయటకొచ్చిన నితీశ్ కుమార్ (Nitish Kumar).. ఆర్జేడీ సాయంతో మరోసారి బిహార్ సీఎం (Bihar CM) పగ్గాలు చేపడుతున్నారు. ఇంతకు ముందే ఓసారి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్.. మరోసారి తన పాత స్నేహితుడికి దగ్గరయ్యారు. మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండేను తెరపైకి తెచ్చిన తరహాలో.. బిహార్లోనూ బీజేపీ (BJP) ప్రయత్నాలు చేస్తోందనే అనుమానంతో నితీశ్ కుమార్ కమలం పార్టీకి దూరమయ్యారు.
నితీశ్ దూరం కావడంతో బిహార్లో తాము మరింత బలపడటానికి ఇదే సరైన తరుణమని బీజేపీ చెబుతోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి బిహార్‌లో 40 సీట్లకు గానూ 39 స్థానాల్లో గెలుపొందింది. 2014 ఎన్నికల్లోనూ బీజేపీ, ఇతర చిన్న పార్టీలతో కలిసి సత్తా చాటింది. నితీశ్ దూరం కావడంతో.. 2024 ఎన్నికల్లో ఈ స్థాయిలో సీట్లు గెలవడం బీజేపీకి సాధ్యం కాకపోవచ్చనే భావన వ్యక్తమవుతోంది.

గత కొంత కాలంగా ‘ఢిల్లీ’కి దూరంగా ఉంటున్న నితీశ్ కుమార్ వైఖరిలో మార్పును గమనించిన బీజేపీ.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను రెండుసార్లు పట్నా పంపింది. జేడీయూతో తాము స్నేహాన్ని కోరుకుంటున్నామనే సంకేతాలను పంపింది. 2025 వరకు నితీశ్ కుమారే బిహార్ సీఎంగా కొనసాగుతారని కేంద్రం హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఇటీవలే భరోసా కూడా ఇచ్చారు. కానీ అవేవీ ఫలితాన్ని ఇవ్వలేదు.

2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ కలిసి పోటీ చేశాయి. ముస్లింలు, యాదవుల ఓటు బ్యాంకు అత్యధికంగా ఉన్న ఆర్జేడీ దాదాపు 30 శాతం ఓట్లను సొంతం చేసుకుంది. ఆర్జేడీ (RJD) కంటే జేడీయూకు తక్కువ సీట్లు వచ్చినప్పటికీ నితీశ్ కుమార్ బిహార్ సీఎం అయ్యారు. బీజేపీ ప్రతిపక్షంలో కూర్చుంది. ఆ తర్వాత మళ్లీ జేడీయూ, బీజేపీ మధ్య స్నేహం కుదిరింది. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఒంటరిగా బరిలోకి దిగి 75 స్థానాలు సాధించగా.. బీజేపీ 74 సీట్లు, జేడీయూ 43 సీట్లు గెలిచాయి. తన పార్టీ మూడో స్థానంలో నిలిచినప్పటికీ నితీశ్ సీఎం అయ్యారు.

కానీ రెండేళ్లు కూడా తిరగక ముందే.. మహారాష్ట్ర పరిణామాల నేపథ్యంలో నితీశ్ అప్రమత్తం అయ్యారు. మళ్లీ ఆర్జేడీకి దగ్గరయ్యారు. ఈ పరిస్థితుల్లో 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్లో బీజేపీ ఎన్ని సీట్లు సాధిస్తుందనే ఆసక్తికరంగా మారింది. బీజేపీ మాత్రం తాము మెరుగైన ఫలితాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.