పుట్టినరోజు నాడే ఓ యువ ఐఏఎస్ అధికారి అనుమానాస్పద స్థితిలో మరణించారు. కర్ణాటక కేడర్ కు చెందిన అనురాగ్ తివారీ లక్నోలోని ఓ గెస్ట్ హౌస్ సమీపంలో ఉన్న రోడ్డు పక్కన పడిపోయి కనపించారు. స్థానికులు వెళ్లి చూడగా... అప్పటికే మరణించారు. ఆయన గడ్డం కింద చిన్న గాయం ఉంది. ఆయన దగ్గర ఉన్న ఐడీ కార్డు ద్వారా అతడిని ఐఏఎస్ అధికారిగా గుర్తించారు పోలీసులు. రెండు రోజుల నుంచి ఆయన అక్కడికి దగ్గర్లో ఉన్న హజ్రత్ జంగ్ మీరాబాయి గెస్ట్ హౌస్ లో నివసిస్తున్నారు. అతడిది అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు పోలీసులు. ఐఏఎస్ అని తెలియగానే పోలీసులు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనురాగ్ 2007లో సివిల్ సర్వీసెస్ లో చేరారు. ఆయన స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని బహ్రెయిచ్. ప్రస్తుతం బెంగళూరులో ఫుడ్ అండ్ సివిల్ సప్లయ్స్ కి కమిషనర్ గా పనిచేస్తున్నారు. ఆయన జన్మదినం కూడా ఇదే రోజు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని మృతికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఎలా మరణించారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
పుట్టినరోజు నాడే... ఐఏఎస్ అనుమానాస్పద మరణం
ఓ యువ ఐఏఎస్ అధికారి అనుమానాస్పద స్థితిలో మరణించారు.
TNN 17 May 2017, 12:26 pm