యాప్నగరం

కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్పకు కరోనా.. ఆస్పత్రిలో చేరిక

Bengaluru: కరోనా వైరస్ సామాన్యులతో పాటు ప్రముఖులనూ వణికిస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్పకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరారు.

Samayam Telugu 3 Aug 2020, 12:28 am
దేశంలో కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇంతకాలం సామాన్యులను వణికించిన వైరస్ ఇప్పుడు ప్రముఖులను భయపెడుతోంది. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప (77)కు కరోనా పాజిటివ్‌గా తేలింది. వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం (ఆగస్టు 2) రాత్రి ఆయన ట్వీట్ చేశారు.
Samayam Telugu సీఎం యెడియూరప్ప
Karnataka CM Yediyurappa Tested Covid Positive


‘నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. వైద్యుల సూచన మేరకు నేను ఆస్పత్రిలో చేరాను. కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారందరూ పరీక్షలు చేసుకోవాలని, సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని కోరుతున్నా’ అని యెడియూరప్ప ట్వీట్ చేశారు.

బీజేపీ నేతలు వరుసగా కరోనా బారిన పడుతుండటం ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తాను కరోనా వైరస్ బారిన పడినట్లు ట్వీట్ చేశారు. డాక్టర్ల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఏపీలో బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మాణిక్యాల రావు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర ప్రదేశ్‌లో కేబినెట్ మంత్రి కమలా రాణి వరుణ్ (62) కరోనాకు చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఆస్పత్రిలో కన్నుమూశారు. యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌ సింగ్ కూడా తాను‌ కరోనా బారినపడినట్లు ట్వీట్ చేశారు. బిహార్‌లో బీజేపీకి చెందిన సుమారు 100 మంది నేతలు ఈ ప్రాణాంతక వైరస్ బారినపడ్డారు.

మరోవైపు.. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 18 లక్షలకు చేరువైంది. రెండు రోజుల్లోనే లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాల విషయంలో భారత్ ప్రపంచంలో ఐదో స్థానానికి ఎగబాకింది.

Also Read: షాక్! వియత్నాంలో తొలి కరోనా మరణం

Watch: శానిటైజర్‌తో జాగ్రత్త.. ఘోర ప్రమాదం తప్పింది!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.