యాప్నగరం

CAA Protest పోలీసులు చెప్పినా వినిపించుకోని నిరసనకారులు.. డీసీపీ చర్యలతో ఉప్పొంగిన దేశభక్తి!

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళనల్లో పెద్ద ఎత్తున జనం పాల్గొని నిరసనలు తెలియజేస్తున్నారు.

Samayam Telugu 20 Dec 2019, 1:55 pm
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నవారిని నిలువరించేందుకు ఓ పోలీస్ అధికారి చేసిన ప్రయత్నంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఆ అధికారి చర్యలతో ఆందోళనలు చేస్తున్నవారంతా మౌనంగా ఉండిపోయి, హృదయాల్లోని దేశభక్తి ఉప్పొంగింది. అప్పటిదాకా నినాదాలతో హోరెత్తించిన వారంతా నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సంఘటన బెంగళూరు గురువారం చోటుచేసుకుంది.

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ గురువారం పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకున్నాయి. నగరంలోని టౌన్‌హాల్‌ వద్దకు వందలాది మంది ఆందోళనకారులు చేరి నిరసన చేపట్టారు. దీంతో బెంగళూరు డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్ సహా పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిరసనకారులకు డీసీపీ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆయన మాటలను వారు వినిపించుకోకుండా ఆందోళనకొనసాగించారు.

సంఘ వ్యతిరేక శక్తులు తమ స్వప్రయోజనాల కోసం ఇలాంటి ఆందోళనలు చేయిస్తున్నాయని డీసీపీ హెచ్చరించారు. అయినా నిరసనకారులు వెనక్కుతగ్గకపోవడంతో డీసీపీ రాథోడ్ వెంటనే ‘జనగణమన’జాతీయ గీతం ఆలపించారు. అది వినగానే ఆందోళనకారులు కూడా లేచి డీసీపీతో కలిసి జాతీయ గీతం పాడారు. అనంతరం మౌనంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను బెంగళూరు ఐజీపీ హేమంత్‌ నింబాల్కర్‌ ట్విటర్‌‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

బెంగళూరు సహా కర్ణాటక వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన సెగలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం నాటి ఆందోళనల్లో పాల్గొన్న ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఇతర ప్రొఫెసర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ దాదాపు 200 మంది వరకూ అరెస్టయినట్లు తెలుస్తోంది. మంగళూరులో అల్లర్లకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కర్ణాటక ఆందోళనలతో అట్టుడుకుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.