యాప్నగరం

ఆపద్ధర్మ సీఎంగా కుమారస్వామి.. కర్ణాటకీయం ఇంకా ముగియలేదా?

Kumaraswamy సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీమాను గవర్నర్ తక్షణమే ఆమోదించారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని సూచించారు.

Samayam Telugu 23 Jul 2019, 11:02 pm
దాదాపు ఏడాదిన్నరగా అనూహ్య మలుపులు తిరుగుతోన్న కర్ణాటక రాజకీయాలు మరో కీలక మలుపు తిరిగాయి. విశ్వాస పరీక్షలో బలం నిరూపించుకోలేకపోవడంతో సీఎం పదవికి కుమారస్వామి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను వెంటనే ఆమోదించిన గవర్నర్ వాజుభాయ్ వాలా.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయనకు సూచించారు. మంచి ముహూర్తం చూసుకొని యడ్యూరప్ప సీఎం పదవిని అధిష్టించడమే ఇక తరువాయి.
Samayam Telugu kumaraswamy resigantion


ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. కర్ణాటక రాజకీయాలు మరోసారి మలుపు తిరిగే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే కర్ణాటకలో 224 మంది శాసనసభ్యులు ఉండగా.. విశ్వాస తీర్మానం సందర్భంగా స్పీకర్ సహా 204 మంది మాత్రమే హాజరయ్యారు. కాంగ్రెస్‌-జేడీయూ కూటమికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు, బీఎస్పీ ఎమ్మెల్యే ఒకరు, ఇద్దరు ఇండిపెండెంట్లు.. ఇలా 21 మంది బలపరీక్షలో పాల్గొనలేదు. రెబల్ ఎమ్మెల్యేలను ఒప్పించి, అసెంబ్లీకి రప్పించేందుకు కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు ప్రయత్నించిన ఫలితం లేకపోయింది.

ఫ్లోర్ టెస్టు జరగడానికి ముందు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు విప్ జారీ చేశారు. విప్ అమల్లో ఉండగా.. ప్రతి ఎమ్మెల్యే తమ పార్టీకే తప్పనిసరిగా ఓటెయ్యాలి, అసెంబ్లీకి గైర్హాజరు కాకూడదు. కానీ కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరు కాలేదు. దీంతో ఆయా పార్టీల ఫిర్యాదు మేరకు స్పీకర్ కేఆర్ రమేశ్ వీరిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంది.

అదే జరిగితే వీరు బీజేపీలో చేరే అవకాశాలు ఉండటంతోపాటు ఉప ఎన్నికలు అనివార్యం. అంటే ప్రస్తుతం 105 మంది సభ్యుల బలం ఉన్న బీజేపీకి.. ఎమ్మెల్యేల గైర్హాజరీతో ఇప్పటికైతే బీజేపీ సభలో మెజార్టీ నిరూపించుకుంటుంది. కానీ సాధారణ మెజార్టీ రావాలంటే మాత్రం మరో 8 మంది ఎమ్మెల్యేలు అవసరం. బీఎస్పీ, ఇండిపెండెంట్లను మినహాయించినా.. మరో ఐదు సీట్లను బీజేపీ గెలుచుకోవాలి. లేకపోతే.. ఇప్పటికే కుమారస్వామి, సిద్ధరామయ్య హెచ్చరించినట్టుగా సంకీర్ణ సర్కారుకు పట్టిన గతే యడ్యూరప్ప ప్రభుత్వానికి పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

కానీ ఓవైపు అండగా గవర్నర్, మరోవైపు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, అన్నింటి కంటే ముఖ్యంగా మోదీ చరిష్మాతో కర్ణాటకలో యడ్యూరప్ప సర్కారు నెట్టుకొని రావచ్చు. అంతకూ ఉప ఎన్నికల్లో బీజేపీకి సరిపడా స్థానాలు రాకపోతే.. మరోసారి విపక్ష ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారు. మరోసారి బై ఎలక్షన్ జరుగుతుంది. అప్పుడైనా బీజేపీకి మెజారటీ రావచ్చు. కాకపోతే దూకుడుగా పరిపాలించడం మాత్రం యడ్డీకి సాధ్యం కాకపోవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.