యాప్నగరం

Karnataka IAS Vs IPS ప్రభుత్వం చర్యలు తీసుకున్నా ఆగని ఐపీఎస్ రూపా.. రోహిణి సింధూరిపై మరో సంచలన పోస్ట్

సోషల్ మీడియా వేదికగా పరస్పర ఆరోపణలకు దిగిన ఇద్దరు మహిళా సివిల్‌ సర్వెంట్లు రూపా మౌడ్గిల్, రోహిణి సింధూరిలపై కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం తెలిసింది. ఇద్దర్నీ ప్రస్తుత స్థానాల నుంచి బదిలీ చేసిన ప్రభుత్వం.. ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వకుండా తటస్థంగా ఉంచింది. ఐపీఎస్ రూపా మౌడ్గిల్‌ భర్త.. మునీష్‌ మౌడ్గిల్‌‌ను సైతం బదిలీ చేసింది. కానీ, వివాదం మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. మరోసారి రోహిణిని టార్గెట్ చేస్తూ రూపా పోస్ట్ పెట్టారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 23 Feb 2023, 6:45 am

ప్రధానాంశాలు:

  • ఐఏఎస్ రోహిణి సింధూరిపై అవినీతి ఆరోపణలు
  • బదిలీ చేసి తటస్థంగా ఉంచిన ప్రభుత్వం
  • కుటుంబాన్ని కాపాడుకోడానికి పోరాటమన్న రూపా
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Rohini Vs Roopa
కర్ణాటకలో సివిల్ సర్వెంట్ల (Karnataka Civil Servants) వివాదానికి ఇప్పట్లో తెరపడే సూచనలు కనిపించడం లేదు. ఐఏఎస్ రోహిణి సింధూరి (Rohini Sindhuri), ఐపీఎస్ రూపా మౌడ్గిల్‌ల (Roopa Moudgil)పై కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుని.. ఇద్దర్నీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా రూపా మౌడ్గిల్.. తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో పెట్టిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది. నా కుటుంబాన్ని కాపాడుకోడానికే పోరాటం చేస్తున్నానంటూ రూపా పోస్ట్ చేయడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. అంతేకాదు, గతంలో తమిళనాడు, కర్ణాటకలో సివిల్ సర్వీసెస్ అధికారులు ఆత్మహత్యలకు వాళ్లు కనీసం జాగ్రత్తలు తీసుకోకపోవడమే కారణమని పేర్కొన్నారు.
‘‘ఐఏఎస్ (IAS)అధికారి రోహిణి సింధూరిపై నేను లేవనెత్తిన అవినీతి అంశాలపై మీడియా దృష్టి సారించాలి. సామాన్యులను ఎక్కువగా ప్రభావితం చేసే అవినీతికి వ్యతిరేకంగా పోరాడకుండా నేను ఎవరినీ అడ్డుకోలేదు.. కనీసం... జాగ్రత్త పడకపోవడంతోనే తమిళనాడులో ఒక ఐపీఎస్‌ అధికారి, కర్ణాటకలో ఒక ఐఏఎస్‌ అధికారి, మరో అధికారి బలవన్మరణానికి పాల్పడ్డారు.. కర్ణాటకలో ఓ ఐఏఎస్‌ అధికారుల జంట విడిపోయింది.. అందుకే నేను జాగ్రత్త పడుతున్నా.. నేను, నా భర్త ఇప్పటికీ కలిసే ఉన్నాం.. దయచేసి ఊహాగానాలు చేయవద్దు. కుటుంబానికి అడ్డంకిగా మారుతున్న తీరును ప్రదర్శించే నేరస్థుడిని దయచేసి ప్రశ్నించండి....

కుటుంబం విచ్ఛిన్నం కాకుండా పోరాటం చేస్తున్నా.. నేను చాలా శక్తివంతమైన మహిళను.. పోరాటం చేస్తాను.. బాధిత మహిళలందరి తరఫున నా పోరాటం.. అందరు మహిళలు ఒకేలా పోరాటం చేయలేరు.. పలువురి జీవితాలు నాశనం అయ్యేందుకు కారణమైన మహిళను నిలదీయక తప్పదు.. భారత్‌ అంటేనే కుటుంబ బంధాలు, విలువలకు పెద్ద పీట వేసే దేశమని అందరికీ తెలుసు.. ప్రజా జీవితాలను ప్రభావితం చేసే అవినీతిపై చేసే పోరుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు రావాలి’ అని ఆమె పిలుపునిచ్చారు.

తాను చెప్పాల్సిన దానిని పరోక్షంగా పోస్టులో రాశారు రూపా మౌడ్గిల్. కాగా, రూపా మౌడ్గిల్, రోహిణి సింధూరిలకు సోషల్ మీడియాలో ఎలాంటి ఆరోపణలు చేయొద్దని, బహిరంగ ప్రకటనలు ఇవ్వొద్దని కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందితాశర్మ ఇప్పటికే ఆదేశించారు. ఇద్దరినీ బదిలీ చేసి, పోస్టింగులు ఇవ్వకుండా హోల్డింగ్‌లో ఉంచినా రూపా ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టడం గమనార్హం.

ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారిణుల మధ్య వివాదాన్ని నిలిపేసేందుకు చర్యలు తీసుకుంటామని ఐటీ, బీటీ శాఖ మంత్రి అశ్వత్థనారాయణ తెలిపారు. ఆయన బుధవారం తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రితో చర్చించి తదుపరి నిర్ణయాన్ని తీసుకుంటామన్నారు. విధాన పరిషత్తులోనూ రూప, రోహిణి గొడవపై ఎమ్మెల్సీ హెచ్‌.విశ్వనాథ్‌, మరికొందరు సభ్యులు బుధవారం మాట్లాడటం గమనార్హం.

Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.