యాప్నగరం

Karnataka సీఎం మార్పుపై ప్రచారం.. మంత్రి ఆడియో లీక్‌తో బొమ్మైకి కొత్త తలనొప్పి

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ముఖ్యమంత్రి మార్పుపై మరోసారి ఊహాగానాలు ఊపందుకున్నాయి. యడియూరప్ప స్థానంలో ఏడాది కిందట సీఎంగా పగ్గాలు చేపట్టిన బసవరాజ్ బొమ్మైపై వ్యతిరేకవర్గం తీవ్ర అసమ్మతి వ్యక్తం చేస్తోంది. ఆయన మార్పుపై డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇటీవల వరుస వివాదాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచి అధికారం నిలుపుకోవాలంటే సీఎంను మార్చాలని కోరుతున్నాయి. గత ఏడెనిమిది నెలలుగా కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలు బీజేపీకి కొంత ఇబ్బందిగా పరిణమించాయి.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 16 Aug 2022, 3:53 pm

ప్రధానాంశాలు:

  • యడియూరప్ప వారసుడిగా బసవరాజ్ బొమ్మై.
  • పదవి చేపట్టిన ఆరు నెలలకే అసమ్మతి రాగం.
  • ప్రభుత్వ పనితీరుపై మంత్రి వ్యాఖ్యలతో రగడ.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu బసవరాజ్ బొమ్మై
కర్ణాటకలో మరోసారి ముఖ్యమంత్రి (Karnataka CM )మార్పుపై జోరుగా ప్రచారం సాగుతుండగా.. ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు మీడియాకు లీక్ కావడంతో సీఎం బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai)కు కొత్త చిక్కు వచ్చిపడింది. మంత్రి వ్యాఖ్యలపై కలకలం రేగడంతో బొమ్మై స్పందించారు. ఈ వ్యాఖ్యలను ధ్రువీకరించిన సీఎం బొమ్మై.. కానీ సందర్భానుసారంగా తీసుకోలేదని వ్యాఖ్యానించారు. ‘‘మేము ప్రభుత్వాన్ని నడపటం లేదు.. మేము దానిని నిర్వహిస్తున్నాం’’ అని కర్ణాటక న్యాయ శాఖ మంత్రి జేసీ మధుస్వామి (Karnataka Minister JC Madhu Swamy) అన్న ఆడియో క్లిప్‌ ఒకటి బయటకు వచ్చింది.
బొమ్మై, ఆయన పాలనపై పెరుగుతున్న అసంతృప్తి కారణంగా మరోసారి కర్ణాటకలో సీఎం మార్పు తథ్యమనే ఊహాగానాల మధ్య ఈ వ్యాఖ్యలు బయటకు రావడం గమనార్హం. అయితే, రెండు రోజుల కిందట బీజేపీకి చెందిన ఓ సీనియర్ నేత మాట్లాడుతూ.. ‘‘ కర్ణాటకలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండగా.. మరో టర్మ్ అధికారం కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది.. బొమ్మై చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారని బీఎస్ యడియూరప్ప (BS Yediyurappa) కూడా కితాబు ఇచ్చారు’’ అని పేర్కొన్నారు. యడియూరప్ప స్థానంలో బసవరాజ్ బొమ్మై గతేడాది జులైలో సీఎంగా నియమితులైన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా బీజేపీ అధిష్ఠానం కర్ణాటక ముఖ్యమంత్రిని మార్చనుందంటూ కొద్దిరోజులుగా విస్తృత చర్చ సాగుతోంది. కేంద్ర మంత్రి అమిత్‌ షా సైతం బెంగళూరుకు వచ్చి స్థానిక నేతలతో చర్చలు జరపడంతో ఈ ఊహాగానాలు మరింత బలన్నిచ్చాయి. అయితే, షా పర్యటన ముగిసిన తర్వాత సీఎం మార్పు ఉండబోదని మాజీ ముఖ్యమంత్రి యడ్డీ ప్రకటించారు. అంతా బాగుందని, ఎటువంటి సమస్యలు లేవని ఆయన వ్యాఖ్యానించారు.

న్యాయశాఖ మంత్రి వ్యాఖ్యలపై మరో మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘‘మేము మేనేజ్ చేస్తున్నామని ఒకవేళ భావిస్తే తక్షణమే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలి.. ఆయన ప్రభుత్వంలో ఓ భాగం.. నిర్ణయాలు తీసుకునే ప్రతి క్యాబినెట్ సమావేశంలోనూ ఆయన పాల్గొంటున్నారు.. ఆయన ఆ ప్రకటన చేశారంటే అందులో ఆయన కూడా భాగస్వామ్యమే. మంత్రి హోదాలో ఉండి ఇలాంటి ప్రకటన చేయడం బాధ్యతారాహిత్యం’’ అని మండిపడ్డారు.

అయితే, సీఎం బొమ్మై మాత్రం ఆచితూచి మాట్లాడారు. ‘సంబంధిత వ్యక్తులందరితోనూ మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాను.. బ్యాంక్ వడ్డీని డిమాండ్ చేస్తున్న సందర్భంలో నష్టపరిచే వ్యాఖ్యలు చేశారు’ అని వివరించారు. ఇదిలా ఉండగా, పాలనపై బొమ్మై పట్టు కోల్పోయారని ఇటీవల కొద్ది నెలలుగా విమర్శలు వినబడుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో హిజాబ్‌తో మొదలైన వివాదం తర్వాత హలాల్, అజాన్.. కాంట్రాక్టర్ ఆత్మహత్య, మంగళూరులో బీజేపీ కార్యకర్త హత్యతో మత ఘర్షణలు వంటివి బొమ్మై ప్రతిష్ఠకు భంగం కలిగించాయి. నిందితుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినబడుతున్నాయి.
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.