యాప్నగరం

Bengaluru వర్షాలపై సమీక్ష.. సీఎం మాట్లాడుతుంటే హాయిగా నిద్రపోయిన మంత్రి!

ఏకధాటిగా సోమవారం తెల్లవారుజామున గంట పాటు కురిసిన భారీ వర్షానికి బెంగళూరు నగరం అతలాకుతలమయ్యింది. రహదారులపై నడుం లోతున నీరు నిలిచిపోగా.. పడవలు, బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించారు. టెక్కీలకు కష్టాలు మామూలుగా లేవు. ఇంటి నుంచి పనిచేసుకోమని సంస్థలు ఆఫర్ ఇచ్చినా.. ఇంట్లో కరెంట్ లేకపోవడంతో ఆఫీసులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకుంది. ట్రాక్టర్లలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్తోన్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 6 Sep 2022, 6:56 pm
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారత సిలికాన్ వ్యాలీ బెంగళూరు నగరం (Bengaluru Floods) అల్లాడుతోంది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత కొద్ది గంటల పాటు కురిసిన వర్షానికి నగరం (Bengaluru Rains) చిగురుటాకులా వణికిపోయింది. రోడ్లు నదులను తలపిస్తుండగా.. లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యారు. పలుచోట్ల బైక్‌లు నీటిలో కొట్టుకుపోగా.. సెల్లార్లలోని కార్లు, ద్విచక్రవాహనాలను వరద ముంచెత్తింది. కొన్ని నిమిషాల్లో నగరం అస్తవ్యస్తమై సిలికాన్ వ్యాలీ (Slicon Valley) కాస్తా చిత్తడిచిత్తడిగా మారిపోయింది. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్నవారిని ట్రాక్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. యూఎన్అకాడమీ సీఈఓ (Unacademy CEO)కుటుంబం ట్రాక్టర్ల సాయంతో బయటపడింది.
Samayam Telugu నిద్రపోతున్న మంత్రి అశోక


ఇదిలా ఉండగా, సెప్టెంబరు 9 వరకూ కర్ణాటక (Karnataka), తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీచేసింది. దీంతో అప్రమత్తమైన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై (Basavaraj Bommai) సోమవారం రాత్రి వర్షాలపై మంత్రులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు హాజరైన మంత్రి ఆర్.అశోక (R Ashoka) సమావేశం అసాంతం కునుకు తీశారు. అధికారులతో సీఎం చర్చిస్తుంటే తనకు అదేమీ పట్టనట్టు మంత్రి ఎంచక్కా నిద్రలో మునిగిపోయారు.


మంత్రిగారు నిద్రపోయి ప్రతిపక్ష కాంగ్రెస్‌ (Congress) చేతికి అస్త్రాన్ని అందించారు. సీఎంతో సమీక్షలో నిద్రపోతున్న మంత్రి ఫొటోను కర్ణాటక కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ‘‘మునకలు చాలా రకాలు. రాష్ట్ర ప్రజలు వర్షాల్లో మునిగిపోతున్నారు. మంత్రి నిద్రలో మునుగుతున్నారు’’ అని వ్యంగ్యంగా క్యాప్షన్ తగిలించింది. కాగా, బెంగళూరులో వరదల పరిస్థితిని చక్కదిద్దేందుకు రూ.300 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సీఎం బొమ్మై తెలిపారు.

రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.