యాప్నగరం

Umesh Katti : ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. ప్రధాని ఈ అంశంపైనే చర్చిస్తున్నారు: కర్ణాటక మంత్రి

కర్ణాటక పౌర సరఫరాల శాఖ మంత్రి ఉమేశ్ కత్తి తాజాగా ఓ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రధాని మోదీ ఉన్నారన్న ఆయన.. ఇదే విషయంపై ఆయన సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు తెలిసిందని పేర్కొన్నారు.

Authored byRaj Kumar | Samayam Telugu 25 Jun 2022, 9:19 am
Samayam Telugu umesh katti
2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పడబోతున్నాయంటూ ఓ కర్ణాటక మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచిస్తున్నట్లు తనకు తెలిసిందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ప్రధాని కర్ణాటకలో పర్యటించిన కొద్ది రోజులకే అధికార పార్టీ సీనియర్‌ నేత ఈ వ్యాఖ్యలు చేయడం చర్చకు దారి తీసింది. మరోవైపు ఈ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కొట్టిపారేశారు.

కర్ణాటక పౌర సరఫరాల శాఖ మంత్రి ఉమేశ్ కత్తి తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రధాని మోదీ ఉన్నారు. ఇదే విషయంపై ఆయన సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగా కర్ణాటక కూడా రెండు కాబోతోంది. ఈ క్రమంలో కొత్తగా ఉత్తర కర్ణాటక ఏర్పడేందుకు మనం పోరాడాలి’ అని మంగళూరులో అన్నారు.


కర్ణాటకలో రెండు, ఉత్తర్‌ ప్రదేశ్‌లో నాలుగు, మహారాష్ట్రలో మూడు.. కొత్త రాష్ట్రాలు ఏర్పడతాయంటూ ఉమేశ్ చెప్పుకొచ్చారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు అనేది మంచి అంశమేనన్న ఆయన.. ఉత్తర కర్ణాటక కూడా రాష్ట్రంగా ఏర్పడి అభివృద్ధి చెందాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రం విడిపోయినా ఎటువంటి ప్రమాదం లేదని.. తామంతా కన్నడిగులుగానే ఉంటామన్నారు.. మరోవైపు దీనిపై మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య స్పందించారు. ‘కర్ణాటకను విడగొట్టేందుకు ప్రధాని స్థాయిలో చర్చలు జరుగుతున్నాయనే విషయం రాష్ట్ర మంత్రి ద్వారా బయటపడింది. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం. బాధ్యతాయుత పదవిలో ఉన్న ఓ మంత్రే ఈ విషయాన్ని వెల్లడించడంపై ముఖ్యమంత్రి, పీఎంఓ కార్యాలయం క్లారిటీ ఇవ్వాలి’ అని ట్వీట్‌లో డిమాండ్‌ చేశారు.

మంత్రి ఉమేశ్ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై కొట్టి పారేశారు. ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా చేసే ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై మాట్లాడడం ఆ మంత్రికి కొత్త కాదని.. ఎన్నో ఏళ్లుగా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆయన ప్రశ్నకు ఆయనే సమాధానం చెప్పుకోవాలంటూ కర్ణాటక సీఎం అన్నారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.