యాప్నగరం

సర్వే: కర్ణాటకలో ఏర్పడే ప్రభుత్వం ఎవరిది?

కర్ణాటక రాజకీయ పరిస్థితులపై అధ్యయనం చేసి ఒక మీడియా సంస్థ వెల్లడించిన సర్వే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Samayam Telugu 14 Apr 2018, 11:58 am
ఒకవైపు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుతుండగా... అక్కడ హంగ్ తప్పదు అని అంటున్నాయి మీడియా సంస్థలు. కర్ణాటక రాజకీయ పరిస్థితులపై అధ్యయనం చేసి ఒక మీడియా సంస్థ వెల్లడించిన సర్వే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటకలో ప్రస్తుతం ఉన్న రాజకీయ స్థితిలో ఏ పార్టీకీ సంపూర్ణమైన మెజారిటీ రాదు అని ఈ సర్వే స్పష్టం చేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినన్ని సీట్లు ఏ పార్టీ కూడా సాధించలేదని ఈ సర్వే పేర్కొంది. సిద్ధరామయ్య నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లను సాధించుకుని పెద్ద పార్టీగా నిలిచే అవకాశం ఉందని, బీజేపీకి రెండోస్థానం దక్కుతుందని, జేడీఎస్ తక్కువ సీట్లతోనే కింగ్ మేకర్ అవుతుందని ఈ సర్వే జోస్యం చెప్పింది.
Samayam Telugu kaelec


ఈ సర్వే ప్రకారం.. 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ కనీసం 90 సీట్లను గరిష్టంగా 101 సీట్లను సాధించుకోగలదు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కనీసం 113 సీట్ల బలం అవసరం అవుతుంది. ఇక భారతీయ జనతా పార్టీకి కనిష్టంగా 78 సీట్లు, గరిష్టంగా 86 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ ఒపీనియన్ పోల్ పేర్కొంది. ఈ విధంగా బీజేపీ మెజారిటీకి చాలా దూరంలో నిలుస్తుందని పేర్కొంది.

ఇక కర్ణాటక ప్రాంతీయ పార్టీ జేడీఎస్ 34 నుంచి 43 సీట్లను సాధించుకోగలదని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. ఇదే విధంగా ఫలితాలు వస్తే.. కర్ణాటకలో హంగ్ తప్పదని చెప్పాలి. కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా.. జేడీఎస్ సహకారం అవసరం అవుతుంది. జేడీఎస్ ఎటువైపు మొగ్గితే వారి ప్రభుత్వం కర్ణాటకలో ఏర్పడే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.