యాప్నగరం

కశ్మీర్ ఎప్పటికే మాదే.. అవసరమైతే సరిహద్దు దాటడానికి వెనుకాడం: రాజ్‌నాథ్

దాయాది దేశం పాకిస్థాన్‌కు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. కశ్మీర్ ఎప్పటికే భారత్‌దేనని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి అవసరమైతే సరిహద్దులు దాటడానికి కూడా ఇండియన్ ఆర్మీ వెనుకాడదని స్పష్టం చేశారు.

TNN 17 Mar 2018, 3:59 pm
దాయాది దేశం పాకిస్థాన్‌కు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. కశ్మీర్ ఎప్పటికే భారత్‌దేనని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి అవసరమైతే సరిహద్దులు దాటడానికి కూడా ఇండియన్ ఆర్మీ వెనుకాడదని స్పష్టం చేశారు. పొరుగు దేశాలతో భారత్ ఎప్పుడూ సత్సంబంధాలనే కోరుకుంటుందనీ.. కానీ, దేశ సమగ్రతకు పాక్ అడ్డుపుల్లలు వేస్తోందని తెలిపారు. ఢిల్లీలో ‘రైజింగ్‌ ఇండియా సమ్మిట్‌’లో ఆయన మాట్లాడుతూ.. పలు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu kashmir belongs to india wont mind crossing border to protect it rajnath singh
కశ్మీర్ ఎప్పటికే మాదే.. అవసరమైతే సరిహద్దు దాటడానికి వెనుకాడం: రాజ్‌నాథ్


‘స్నేహితులు మారతారు.. కానీ, పొరుగుదేశాలు మారవని అటల్‌ బిహారీ వాజ్‌పేయ్‌ అనే వారు. పొరుగు దేశాలతో బాగుండాలనే మేం కోరుకుంటాం. కానీ, పాక్ మాత్రం ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరిచే దిశగా ఏమాత్రం ప్రయత్నించదు. ఉగ్రవాదులను నియంత్రించేందుకు ఆ దేశం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.’ అని రాజ్‌నాథ్ అన్నారు.

అంతర్జాతీయ సమాజం ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తి పాక్‌లో రాజకీయ పార్టీ ప్రారంభించాడని, ఆ దేశ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడని రాజ్‌నాథ్ తెలిపారు. హక్కానీ నెట్‌వర్క్‌కు పాక్ సాయం చేస్తోందని అన్నారు. ఇరు దేశాల మధ్య శాంతిపూర్వకమైన వాతావరణం నెలకొనేలా చేసేందుకు ప్రధాని మోదీ పలుమార్లు ప్రయత్నించినా.. వాటిని పాక్‌ అడ్డుకుంటూ వచ్చిందని ఆయన చెప్పారు.

భారత సైన్యంపై రాజ్‌నాథ్ ప్రశంసలు కురిపించారు. అంతర్గతంగా దేశానికి భద్రతను కల్పించడమే కాదు, అవసరమైతే దేశాన్ని రక్షించుకోవడానికి సరిహద్దును దాటడానికి కూడా భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
యూపీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ రాజ్‌నాథ్.. ‘ఇలాంటివి కూడా జరుగుతాయని గోరఖ్‌పూర్ ఫలితాలు నిరూపించాయి. కానీ, ఇలాంటివి మరోసారి జరగకుండా జాగ్రత్త తీసుకుంటాం’ అన్నారు. 29 ఏళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న గోరఖ్‌పూర్‌లో 29 ఏళ్ల యువకుడి చేతిలో ఆ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.