యాప్నగరం

Summer Holidays: విద్యార్థులకు వేసవి సెలవులపై కేరళ హైకోర్టు సంచలన తీర్పు

Summer Holidays: విద్యార్థులకు విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత కొన్ని రోజులు విరామం ఉంటుంది. ఈ విరామం వల్ల వారు మానసికంగా ఉల్లాసంగా ఉండి కొత్త విద్యా సంవత్సరంలోకి అడుగుపెడతారు. ఏడాదంతా చదువులతో సతమతమయ్యే విద్యార్థులకు వేసవి సెలవులు ఉల్లాసాన్ని ఇస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదే విషయాన్ని కేరళ హైకోర్టు మరోసారి వెల్లడించింది. వేసవి సెలవుల్లో పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహించడాన్ని మాత్రం హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టడం గమనార్హం.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 25 May 2023, 11:18 am

ప్రధానాంశాలు:

  • వేసవి సెలవుల్లో ప్రత్యేక తరగతులపై కేరళ నిషేధం
  • హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన సీబీఎస్‌ఈ పాఠశాలలు
  • పిల్లలకు సెలవులు అవసరమైన నొక్కిచెప్పిన హైకోర్టు.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu kerala High Court
విద్యార్థులకు వేసవి సెలవుల విషయంలో కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులకు వేసవి సెలవులు అవసరమేనని, చదువులతో ఏడాది అంతా ఉక్కిరిబిక్కిరియ్యే చిన్నారులకు ఇవి ఉపశమనం కలిగిస్తాయని పేర్కొంది. తదుపరి విద్యా సంవత్సరానికి పిల్లలు ఉత్సాహంగా సన్నద్ధమయ్యే శక్తిసామర్థ్యాలను వేసవి సెలవులు అందించి సహకరిస్తాయని సమర్థించింది. వేసవి సెలవుల్లో పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహించడాన్ని కేరళ ప్రభుత్వం నిషేధించడం సమంజమేనని అభిప్రాయపడింది.
సంప్రదాయ చదువుల నుంచి ఇతర కార్యకలాపాలవైపు విద్యార్థుల దృష్టి మళ్లించడానికి, మానసిక ఉల్లాసం కోసం బంధువులతో సరదాగా గడిపేందుకు ఈ సెలవులు అవకాశం కల్పిస్తాయని న్యాయమూర్తి జస్టిస్‌ పీవీ కున్హికృష్ణన్‌ స్పష్టం చేశారు. వేసవి సెలవుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించకూడదని కేరళ విద్యాశాఖ డైరెక్టర్‌ జనరల్‌ మే 3న ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సీబీఎస్‌ఈ స్కూల్స్ కేరళ హైకోర్టులో రిట్ పిటిషన్‌లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు వాదనలు ఆలకించింది.

‘విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వడం వెనుక ఒక ఉద్దేశం ఉంది.. సెలవుల్లో వారు ఆహ్లాదంగా గడపాలి. క్రికెట్‌, ఫుట్‌బాల్‌ లేదా ఇష్టమైన ఆటలు ఆడాలి.. డ్యాన్సులు చేయాలి.. పాడాలి. హోంవర్క్‌ కోసం భయపడాల్సిన అవసరం లేకుండా తమకు నచ్చినవి తీరిగ్గా తినాలి. వారికి ఇష్టమైన టీవీ కార్యక్రమాలు చూడాలి.. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి యాత్రలను ఆస్వాదించాలి.. కొత్త విద్యా సంవత్సరానికి వెళ్లేముందు విరామం అవసరం.. ముఖ్యంగా పదో తరగతి, హయ్యర్ సెకెండరీ విద్యార్థులు తమ జీవితంలోని నిర్ణయాత్మక విద్యా సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు కచ్చితంగా విరామం తప్పనిసరి’ అని న్యాయమూర్తి స్పష్టంచేశారు.

తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు అభ్యంతరం లేకపోతే ప్రత్యేక తరగతులు నిర్వహించుకోవచ్చని 2018లో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించలేనని, దానిని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపారు. వేసవి ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక తరగతులు నిర్వహించొద్దని, విద్యార్థులు సెలవులను ఆస్వాదించే అవకాశం ఉండదని కేరళ విద్యాశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

దీనిపై మరో సింగిల్ జడ్జి రెండు వారాల మధ్యంతర స్టే విధించి, సెలవుల్లో తరగతులను కొనసాగించడానికి అనుమతించారు. తాజగా, జస్టిస్ పీవీ కున్హికృష్ణన్‌ ఆ ఉత్తర్వులను పక్కనబెట్టారు. కేరళ విద్యాశాఖ నిబంధనలు రూల్ 1 చాప్టర్ 7 ప్రకారం ఏటా మార్చి చివరి పనిదినం రోజున వేసవి సెలవుల కోసం మూసివేసి.. జూన్‌లో మొదటి పని దినం రోజున తెరుచుకోవాలి.

Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.