యాప్నగరం

శబరిమలలోకి మహిళల ప్రవేశం.. వెనక్కుతగ్గిన కేరళ ప్రభుత్వం!

అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలన్న తీర్పుపై రివ్యూ పిటిషన్ల దాఖలుకాగా, దీనిపై రాజ్యాంగ ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీచేసింది.

Samayam Telugu 15 Nov 2019, 4:25 pm
శనివారం సాయంత్రం మండల పూజలకు శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు తెరుచుకోనుండగా మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఎటూతేల్చకపోవడంతో ఉత్కంఠ నెలకుంది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కూడా ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించింది. మహిళలను ఆలయంలోకి అనుమతించే విషయమై న్యాయసలహా తీసుకుంటామని కేరళ సీఎం పినరయ్ విజయన్ ప్రకటించారు. తాజాగా, దేవాదాయ మంత్రి కడకంపల్లి సురేంద్ర కూడా ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరువనంతపురంలో ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. శబరిమల ఉద్యమాల ప్రదేశం కాదని, పబ్లిసిటీ కోసం ఆలయంలోకి ప్రవేశిస్తామని ప్రకటించేవారికి తమ ప్రభుత్వం ఎలాంటి మద్దతు ఇవ్వబోదని ఆయన ఉద్ఘాటించారు. మహిళలు ఆలయంలోకి ప్రవేశించడానికి రక్షణగా పోలీసులతో భద్రత ఏర్పాటుచేసినట్టు జరుగుతోన్న ప్రచారాన్ని మంత్రి కొట్టిపారేశారు.
Samayam Telugu sabarimala4


శబరిమల అయ్యప్పను దర్శించుకునే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రక్షణ కల్పించే ఆలోచనేమీ లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ శాంతియుత వాతావరణం కోసమే కృషి చేస్తుందని, కాబట్టి ప్రస్తుతానికి సన్నిధానం వద్ద యథాతథ స్థితిని కొనసాగించడమే సరైందని ఆయన అభిప్రాయపడ్డారు. నవంబరు 16న అయ్యప్ప దేవాలయాన్ని దర్శించుకుంటానన్న సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్‌ ప్రకటించారు. దీనిపై స్పందించిన మంత్రి సురేంద్రన్‌.. శబరిమల ఆలయానికి ఎవరైనా వెళ్లాల్సిన అవసరం ఉంటే కోర్టును ఆశ్రయించి ఆదేశాలు తెచ్చుకోవచ్చని వ్యాఖ్యానించారు.

తమ ఉద్యమస్ఫూర్తిని ప్రదర్శించడానికి ఇది ఉద్యమాలు చేసే చోటు కాదని, కొందరు పబ్లిసిటీ కోసమే ప్రెస్‌మీట్ పెట్టి ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఇలాంటి వారికి ప్రభుత్వం మద్దతు ఇవ్వదని తెలిపారు. గతేడాది సెప్టెంబరు 28 నాటి తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదని, తాము శబరిమలను దర్శిస్తామని కొంత మంది ఉద్యమకారులు చేస్తున్న ప్రకటన గురించి ప్రస్తావించగా.. అలా అయితే కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోవాలని మంత్రి సూచించారు.

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం సహా ఇతర మతపరమైన అంశాలను ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం పరిశీస్తుందని గురువారం సుప్రీంకోర్టు వెల్లడించిన విషయం తెలిసిందే. 2018లో మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను పెండింగ్‌లో పెట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.