యాప్నగరం

కేరళలో వరదల బీభత్సం: కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి.. శిథిలాల కింద 75 మంది?

కేరళలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి కురుస్తోన్న వర్షాలకు కేరళ మరోసారి చిగురుటాకులా వణికిపోతోంది. 2018లో వరద దృశ్యాలు ఇంకా కళ్లముందు కదలాడుతున్నాయి.

Samayam Telugu 7 Aug 2020, 1:15 pm
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. పెరియార్ నది ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తోంది. ఇడుక్కి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. ఇడుక్కి జిల్లా రాజామాలా ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలను తరలించినట్టు కేరళ ఆరోగ్య మంత్రి శైలజ తెలిపారు.
Samayam Telugu కేరళలో వరదలు బీభత్సం
Kerala landslides


అలాగే, వైద్య బృందాలు, 15 అంబులెన్స్‌లను అక్కడకు పంపినట్టు తెలిపారు. మొబైల్ మెడికల్ టీమ్ అక్కడకు చేరుకుందని, మరిన్ని బృందాలను పంపనున్నామని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. శిథిలాల కింద 75 మంది వరకూ చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఇప్పటి వరకూ 10 మందిని సురక్షితంగా బయటకు తీసిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు.. వారిని వైద్యం కోసం మున్నార్‌లోని టాటా జనరల్ ఆస్పత్రికి తరలించాయి. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో 82 మందితో కూడిన నాలుగు కార్మిక క్యాంప్‌లు ఉన్నాయి. దుర్ఘటన జరిగే సమయానికి చాలా మంది అక్కడ ఉన్నారనేది ఖచ్చితంగా తమకు తెలియదని కేరళ రెవెన్యూ మంత్రి చంద్రశేఖరన్ అన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటి వరకూ చేరుకోలేదని, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో బాధితులను వాయు మార్గం ద్వారా తరలించడం సాధ్యం కాదని అన్నారు.

అటు వాయనాడ్ జిల్లాల్లో వేలాది ఏకరాల్లో పంట నష్టం సంభవించింది. కోజికోడ్ జిల్లాలోనూ అనేక ప్రాంతాలు నీటమునిగాయి. పెరియార్ డ్యామ్‌కు వరద పోటెత్తడంతో గేట్లును ఎత్తి కిందకు భారీగా నీటిని వదులుతున్నారు. అగ్నిమాపక, సహాయక విభాగాలకు చెందిన 50 మందిని కొండచరియలు విరిగిపడిన రాజమాలా ప్రాంతానికి పంపినట్టు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.