యాప్నగరం

సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు పుల్‌స్టాప్.. మూడు దశల్లో బలగాల ఉపసంహరణ!

గడచిన ఆరు నెలలుగా భారత్-చైనా సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు తర్వలోనే సమసిపోనున్నాయి. ఈ అంశంపై జరిగిన ఎనిమిదో దశ సైనికాస్థాయి చర్చల్లో పరస్పర అంగీకారానికి వచ్చాయి.

Samayam Telugu 11 Nov 2020, 3:27 pm
సరిహద్దుల్లో తూర్పు లడఖ్ వద్ద భారత్-చైనాల మధ్య కొనసాగుతోన్న ప్రతిష్టంభనకు త్వరలోనే తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాలూ తమ సైన్యాలను వెనక్కు మళ్లించడానికి ఓ అంగీకరానికి వచ్చినట్టు తెలుస్తోంది. మే నెలకు ముందున్న పరిస్థితిని నెలకొల్పడానికి నవంబరు 6న భారత్-చైనా సైనికాధికారుల మధ్య జరిగిన ఎనిమిదో విడత చర్చల్లో ఒప్పందానికి వచ్చాయి.
Samayam Telugu భారత్-చైనా సరిహద్దు వివాదం
India China Border


‘చర్చల్లో నిర్ణయించిన ప్రకారం తొలుత పాంగాంగ్ సరస్సు వద్ద మూడు దశల్లో బలగాలను వెనక్కు మళ్లించాలి.. ట్యాంకులు, బలగాలను తరలించే వాహనాలు సహా సాయుధ వాహనాలను వాస్తవాధీన రేఖకు ఇరువైపులా సమాన దూరంలో వెనక్కు మళ్లించాలి’ అని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. తొలి దశలో భాగంగా ఒక్క రోజులోనే ట్యాంకులు, సాయుధ బలగాల వాహనాలను తమ తమ స్థావరాలకు మరలించాలి.

నవంబరు 6న జరిగిన చర్చల్లో విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి నవీన్ శ్రీవాస్తవ, జనరల్ మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టరేట్ జనరల్ బ్రిగేడియర్ ఘాయ్ పాల్గొన్నారు.

రెండో దశలో పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరంలో మోహరించిన బలగాల్లో రోజుకు 30 శాతం చొప్పున మూడు రోజుల్లోనే వెనక్కు తీసుకోవాలి. ఫింగర్ 8 తూర్పు భాగానికి మళ్లేందుకు చైనా అంగీకరించినప్పుడు.. ధాన్ సింగ్ థపా పోస్ట్‌కు సమీపంగా భారత్ వెళ్లేందుకు సమ్మతించింది. మూడో దశలో పాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలోని చుషుల్, రెజాంగ్ సహా అనేక శిఖరాల నుంచి భారత్, చైనాలు తమ సైన్యాలను వెనక్కు తరలించాలి.

బలగాల మళ్లింపు ప్రక్రియను పరిశీలించడానికి ఇరు దేశాలూ సంయుక్తంగా ఓ వ్యవస్థను ఏర్పాటుచేయడానికి అంగీకరించాయి. అయితే, గతంలో బలగాలను వెనక్కు తీసుకున్నట్టు నటించిన చైనా దొంగదెబ్బ తీసింది. గాల్వాన్ లోయ వద్ద చైనా సైన్యం దాడికి పాల్పడటంతో 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీనిని దృష్టిలో ఉంచుకుని భారత్ చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి.

సరిహద్దుల్లో చైనా ఎటువంటి దుస్సాహసానికి పాల్పడినా ఎదుర్కొడానికి భారత సైన్యం సిద్ధంగా ఉంది. చైనా కంటే పర్వత శిఖరాలపై పోరాటంలో భారత సైన్యం మెరుగ్గా ఉండటం, ఎల్ఏసీ వెంబడి పాంగాంగ్ ఉత్తర, దక్షిణ తీరంలో కీలక ప్రాంతాలపై ఆర్మీ తన పట్టునిలుపుకుంటోంది. ఏప్రిల్-మే నుంచి వివాదాస్పద ప్రాంతాల్లోకి చైనా చొరబడి, అవి తమవేనని వాదిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.