యాప్నగరం

ఒక్కసారి రథయాత్ర ఆపితే 12ఏళ్లు నిర్వహించరాదా? చరిత్ర ఏం చెబుతోంది?

పూరీలోని జగన్నాథ ఆలయంలో ఏటా రథయాత్రను నిర్వహించే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ యాత్రలో తొలి రోజు తన సోదరుడు బలభద్రుడు, సుభద్రతో కలిసి జగన్నాథుడు ఆలయం నుంచి బయటకు వస్తాడు.

Samayam Telugu 22 Jun 2020, 4:35 pm
ఇక, ఈ ఏడాది పూరీ జగన్నాథుని రథయాత్రపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. కరోనా వైరస్ కారణంగా రథయాత్రను నిర్వహించవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు వెలువరించగా.. దీనిపై హిందూ సంఘాలు, ఆలయ వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమయ్యింది. శతాబ్దాలుగా నిర్వహిస్తున్న రథయాత్రను ఆపడం సరికాదని, ఇది కోట్లాది మంది మనోభావాలతో ముడిపడి ఉందని కేంద్రం సైతం కోర్టుకు విన్నవించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వినతులను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం యాత్ర నిర్వహణకు అనుమతి ఇచ్చింది.
Samayam Telugu పూరీ జగన్నాథుని రథయాత్ర
Puri Jagannath Rath Yatra


అయితే, ఒక్కసారి రథయాత్ర ఆపితే వరుసగా 12ఏళ్లపాటు నిర్వహించరాదనే ఆచారం ఉందని, విగ్రహాలను ఆలయం నుంచి బయటకు తీసుకురాకూడదని కోర్టుకు తెలియజేశాయి. కానీ, గతంలో రథయాత్రను నిలిపివేసిన దాఖలాలు ఉన్నాయని చరిత్రకారులు అంటున్నారు.

గత 425 ఏళ్లలో 32 సార్లు రథయాత్రను నిలిపివేయగా.. ఎక్కువసార్లు దాడుల సమయంలోనే యాత్ర ఆగిపోయింది.. తొలిసారి 1568లో బెంగాల్ రాజు సులైమన్ కిర్రానీ సైన్యాధిపతి కాలా పహద్ అలియాస్ కాలా చంద్ రాయ్ ఆలయంపై దాడిచేసి దోచుకున్నాడు.. ఆ తర్వాత తొమ్మిదేళ్ల పాటు రథయాత్రను నిర్వహించలేదు’ అంటూ ఆలయ చరిత్రకారుడు తెలిపారు.

మరోవైపు, 285 ఏళ్ల కిందట చివరిసారిగా 1733 నుంచి 35 మధ్య కూడా యాత్రను నిర్వహించలేదు. జగన్నాథ ఆలయంపై నాటి ఒడిశా డిప్యూటీ గవర్నర్ మొహమూద్ తాఖీ ఖాన్ దాడిచేసి, బలవంతంగా ఆలయంలోని విగ్రహాలను గంజాం జిల్లాకు తరలించారు.

ఇక, ఒడిశాలోని పూరీ జగన్నాథుని ఆలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ విగ్రహాలు చిత్రమైన రూపంలో ఉండటం వెనుక ఒక ఐతిహ్యాన్ని చెప్పుకున్నప్పటికీ, స్థానిక తెగలు ఆరాధించే రూపంలో ఈ మూర్తులు ఉండటం ఒక విశేషం. దానికి అనుగుణంగా జగన్నాథుని చరిత్రలో ఆయనను ఆదిమజాతివారు ఆరాధించుకున్న ప్రస్తావనలు కూడా కనిపిస్తాయి. అంటే ఈ దైవం అందరివాడన్న మాట. ఇక ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ‘నవకళేబర’ పేరుతో ఈ దారు విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ఉంచడం మరో విశేషం.

సాధారణంగా శోభాయాత్ర జరిగినప్పుడు ఉత్సవ విగ్రహాలను ఊరేగించడం ఆనవాయితీ. కానీ అందుకు విరుద్ధంగా సాక్షాత్తూ మూలవిరాట్టులే రథయాత్రకు కదిలిరావడం ఒక అద్భుతం. ఇక స్వామివారు సతీసమేతంగా కాకుండా అన్నాచెల్లెల్లతో గర్భాలయంలో కొలువై ఉండటం విచిత్రం. అరుదైన ఈ విషయాన్ని జీర్ణించుకోవడం కష్టం కాబట్టి చాలామంది భక్తులు సుభద్ర అంటే శ్రీకృష్ణుని అష్టభార్యలలో ఒకరని అపోహపడుతూ ఉంటారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.