యాప్నగరం

లోప భూయిష్టమైన చట్టాలతో సమస్యలు.. కోర్టులకు పనిభారం: జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

చట్టాలు లోపరహితంగా ఉండాలని, పార్లమెంట్‌లో చట్టాలను రూపుదిద్దుకునేటప్పుడు అర్ధవంతమైన చర్చ జరగాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ ఆకాంక్షించారు.

Samayam Telugu 28 Nov 2021, 3:57 pm

ప్రధానాంశాలు:

  • చట్టాల విషయంలో పాలకులు చర్చ జరపాలని సూచన.
  • కోర్టుల్లో ఉద్యోగాలను భర్తీచేయాలని సీజేఐ సూచనలు.
  • అణ్యాక్రాంత యోగ్యతపత్రాల చట్టంపై విమర్శలు.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu జస్టిస్ ఎన్వీ రమణ
CJI
పార్లమెంట్‌లో రూపుదిద్దుకునే చట్టాలపై అర్ధవంతమైన చర్చ జరగాలని, ఆమోదించేటప్పుడు వాటి ప్రభావాన్ని అంచనా వేయకపోతే అనర్ధాలకు దారితీస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ దినోత్సవ ముగింపు వేడుకల్లో శనివారం పాల్గొని న్యాయమూర్తులు, లాయర్లను ఉద్దేశించిన చీఫ్ జస్టిస్ ప్రసంగించారు.
ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. చట్టసభలు తాము ఆమోదించే చట్టాల ప్రభావాన్ని అంచనా వేయకపోతే కొన్నిసార్లు పెద్ద సమస్యలకు దారి తీసి, న్యాయవ్యవస్థపై కేసుల భారం పెరిగిపోతుందని జస్టిస్‌ అన్నారు. అందుకు ఉదాహరణగా అణ్యాక్రాంత యోగ్యతా చట్టంలో (నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌) సెక్షన్‌ 138ని ప్రవేశ పెట్టడాన్ని ప్రస్తావించారు.

ఈ చట్టానికి సంబంధించి కింది కోర్టుల్లో వేలాది కేసులు పేరుకుపోయాయని, ఇప్పటికే కేసుల భారంతో సతమతమవుతున్న మెజిస్ట్రేట్లపై ఈ చట్టం వల్ల మరింత భారం పడిందని చీఫ్ జస్టిస్ చెప్పారు. ఖాతాల్లో సరిపడా నగదు నిల్వలు లేకుండా జారీచేసే చెక్కులు చెల్లకపోవడం గురించి ఈ చట్టాన్ని చేశారని ప్రస్తావించారు.

ఎటువంటి సమస్యలెదురైనా న్యాయాన్ని అందించే లక్ష్యం దెబ్బ తినకూడదని స్పష్టం చేశారు. రెండు రోజుల పాటు రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా జరిగిన సదస్సులో వచ్చిన సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

న్యాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.9 వేల కోట్లు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు మాచింగ్‌ గ్రాంట్లతో ముందుకు రాకపోవడం, కేంద్ర నిధులను వినియోగించుకోక పోవడం సమస్యగా మారిందన్నారు. అందుకే, తాను న్యాయ మౌలిక సదుపాయాల అథారిటీ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నానని చెప్పారు. న్యాయ వ్యవస్థల్లో ఖాళీలను కూడా వేగంగా భర్తీ చేయాలని మరోసారి కేంద్ర న్యాయశాఖమంత్రిని కోరారు.

రాజ్యాంగ పరిరక్షణకు తాము నిర్విరామంగా కృషి చేస్తున్నప్పటికీ రాజ్యాంగం గురించి అవగాహన కల్పించేందుకు మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని జస్టిస్‌ రమణ నొక్కి చెప్పారు. న్యాయవ్యవస్థ పునర్నిర్మాణం జరగాలన్న అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ సూచనలను సీజే ప్రస్తావించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు.

న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని రాష్ట్రపతి చెప్పడం పట్ల జస్టిస్‌ రమణ హర్షం వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ వంటి సమస్యలు వచ్చినపుడు న్యాయ వ్యవస్థ అవసరానికి తగ్గట్లు పని చేసిందని చెప్పారు. భారతీయ న్యాయ వ్యవస్థే అన్నిటి కంటే ముందుగా ఆన్‌లైన్‌ పద్ధతిలో పని చేసిందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.