యాప్నగరం

మిడతలతో కొత్త ముప్పు.. విమానాలకూ ప్రమాదం

DGCA: మిడతల దండుతో కొత్త సమస్య వచ్చిపడింది. విమానాలకు ముప్పు ఏర్పడింది. ఈ నేపథ్యంలో పైలట్లకు, ఇంజనీర్లకు డీజీసీఏ మార్గదర్శకాలను విడుదల చేసింది. ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Samayam Telugu 30 May 2020, 12:52 am
మిడతల దండుతో కొత్త ముప్పు ముంచుకొచ్చింది. ఈ ఎడారి పురుగులతో పంటలకే కాదు.. విమానాలకూ ముప్పు ఏర్పడింది. విమానాలు టేకాఫ్‌, ల్యాండింగ్‌ సమయంలో ఈ మిడతల దండు వల్ల సమస్యలు ఎదురవుతాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) హెచ్చరించింది. మిడతల దండు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పైలట్లకు, ఇంజినీర్లకు శుక్రవారం (మే 29) కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.
Samayam Telugu విమానాలకు మిడతలతో ముప్పు
DGCA guidelines on Locust


విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే సమయంలోనే మిడతల దండుతో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని డీజీసీఏ పేర్కొంది. మిడతలు తక్కువ ఎత్తులో ఎగురుతాయని వివరించింది. అందువల్ల విమానాల టేకాఫ్‌, ల్యాండింగ్‌ సమయంలో కిటికీలు, ఇతర ప్రవేశ ద్వారాల్లోకి ఇవి పెద్ద సంఖ్యలో చొచ్చుకెళ్లే ప్రమాదం ఉందని తెలిపింది.

మిడతల దండు మీదుగా ప్రయాణించినప్పుడు విమానానికి చెందిన పిటాట్‌, స్టాటిక్‌ నాళాలు (గాలి వేగాన్ని అంచనా వేసే పరికరం) పాక్షికంగా లేదా పూర్తిగా మూసుకుపోయే ప్రమాదం ఉందని డీజీసీఏ విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అవి మూసుకుపోయినట్లయితే.. వాటి నుంచి తప్పుడు సంకేతాలు అందుతాయని తెలిపింది. ముఖ్యంగా ఎయిర్‌ స్పీడ్‌, అల్టీ మీటర్‌ సూచీలు తప్పుడు సంకేతాలను సూచించవచ్చని హెచ్చరించింది.

మిడతల దండు ఎదురుగా వస్తున్నప్పుడు వైపర్లను వేయడం వల్ల మరకలు పడే ప్రమాదం ఉందని డీజీసీఏ తెలిపింది. మిడతల గుంపును గుర్తించినట్లయితే.. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిబ్బంది వెంటనే వచ్చీపోయే విమానాల సిబ్బందికి ఆ సమాచారం ఇవ్వాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. విమాన సిబ్బంది కూడా ఈ సమాచారాన్ని పరస్పరం ఇతర సిబ్బందితో పంచుకోవాలని సూచించింది.

ఎయిర్‌పోర్టులలో నిలిపి ఉంచిన విమానాలను కూడా తనిఖీ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలించాలని డీజీసీఏ సూచించింది. అయితే.. రాత్రివేళ్లలో మిడతల గుంపు సంచరించకపోవడం అనేది కాస్త ఊరట కల్పించే అంశమని డీజీసీఏ పేర్కొంది. మిలియన్ల సంఖ్యలో ఉన్న మిడతల గుంపు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరితే.. ఆ దృశ్యం తుఫాన్ తీరం దాటిన ఘట్టాన్ని తలపిస్తోంది. మిడతలు రహదారుల మీదుగా ఎగిరినప్పుడు వాహనదారులు తమ వాహనాలను నిలిపివేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. పగటి పూట వందలాది కిలోమీటర్ల దూరం ఎగిరుతూ వెళ్లే మిడతలు.. రాత్రి పూట చెట్లపై వాలి ఉండటం గమనార్హం.

Also Read: మిడతలపై యుద్ధం: వందల ఫైరింజన్లు, యూకే నుంచి స్ప్రేయర్లు.. మింగుడుపడని నిజాలు!

కరోనాపై పోరాడుతున్న వేళ మిడతల రూపంలో దేశానికి కొత్త సమస్య ఎదురైంది. మిడతలు చూడటానికి చిన్నవే అయినా.. వాటి వల్ల కలిగే ముప్పు ఎక్కువగా ఉంది. వేలాది ఎకరాల్లో పంటలను నాశనం చేస్తున్నాయి. ఒక్క రోజులో 35 మందికి సరిపడే ఆహారాన్ని హాంఫట్ చేస్తున్నాయి. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఇప్పటికే తీవ్ర నష్టం కలిగించాయి.

మొట్టమొదట రాజస్థాన్‌లోకి ప్రవేశించిన ఈ మిడతల దండు క్రమంగా పంజాబ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు కూడా విస్తరించింది. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ వైపు వచ్చే ప్రమాదం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

Must Read: కరోనా ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ కుదేలు.. 11 ఏళ్ల కనిష్టానికి జీడీపీ వృద్ధిరేటు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.