యాప్నగరం

వందేమాతరం తప్పనిసరి.. తమిళనాట రగడ!

జాతీయ గేయం ‘వందేమాతరం’ను తమిళనాడులోని పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాయాలు, పరిశ్రమల్లో తప్పనిసరిగా ఆలపించాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది.

TNN 26 Jul 2017, 9:32 am
జాతీయ గేయం ‘వందేమాతరం’ను తమిళనాడులోని పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాయాలు, పరిశ్రమల్లో తప్పనిసరిగా ఆలపించాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. పాఠశాలలు, కళాశాలల్లో వారానికి ఒకసారి.. ఆఫీసుల్లో నెలకోసారైనా వందేమాతరం ఆలపించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల్లో సోమవారం లేదా శుక్రవారం నాడు వందేమాతరం ఆలపించొచ్చని చెప్పింది. ఒకవేళ జాతీయ గేయాన్ని బెంగాళీ లేదా సంస్కృతంలో ఆలపించడానికి ప్రజలు ఇబ్బందిపడుతున్నట్లయితే దాన్ని తమిళంలోకి అనువదించాలని సూచించింది. రాష్ట్ర సమాచారశాఖ వందేమాతరం గీతాన్ని తమిళం, ఇంగ్లిష్ భాషల్లోకి అనువదించి ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అందరికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఎం.వి.మురళీధరన్ ఉత్తర్వులు జారీ చేశారు.
Samayam Telugu madras hc makes vande mataram mandatory in schools govt and private offices
వందేమాతరం తప్పనిసరి.. తమిళనాట రగడ!


ఇటీవల జరిగిన ఉపాధ్యాయ ఎంపిక పరీక్షలో ‘వందేమాతరం గీతాన్ని తొలుత ఏ భాషలో ఆలపించారు?’ అనే ప్రశ్నకు కె. వీరమణి అనే అభ్యర్థి బెంగాలీ భాష అని సమాధానం రాశాడు. టీచర్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెలువరించిన సమాధానాల్లో ‘సంస్కృతం’ అని ఉంది. ఈ కారణంగా వీరమణికి ఒక మార్కు తగ్గి ఉద్యోగం కోల్పోయాడు. దీంతో అతను మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. టీచర్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన పరీక్షలో తనకు 89 మార్కులు వచ్చాయని, అయితే బోర్డు 90 మార్కులను కట్‌ఆఫ్‌గా నిర్ణయించిందని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ‘వందేమాతరం’ ప్రశ్న వల్లే తనకు ఆ ఒక్క మార్కు తగ్గిందని తెలిపాడు. చాలా పుస్తకాల్లో వందేమాతరాన్ని తొలుత బెంగాలీలోనే ఆలపించేవారని ఉందని, కానీ బోర్డు మాత్రం సంస్కృతం అని సమాధానం వెలువరించిందని.. దీనిపై తనకు న్యాయం చేయాలని కోరాడు.

దీనిపై విచారణ జరిపిన జస్టిస్ మురళీధరన్ మంగళవారం తీర్పు వెల్లడించారు. వీరమణి సమాధానం సరైనదేనని, అతనికి ఒక మార్కు కలిపి ఉద్యోగంలో చేర్చుకోవాలని టీచర్ రిక్రూట్‌మెంట్ బోర్డును ఆదేశించారు. ఈ సందర్భంలోనే భావితరాల్లో దేశభక్తిని పెంపొందిచేందుకు... అన్ని పాఠశాలలు, కళాశాలల్లో కనీసం వారానికి ఒకసారైనా విద్యార్థుల చేత వందేమాతరం ఆలపించాలని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దీనిపై ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తాము వందేమాతరాన్ని ఆలపించేది లేదని ముస్లిం సంఘాల నేతలు తెగేసి చెబుతున్నారు. కోర్టు ధిక్కారానికి సై అంటున్నారు. మరి దీని తరవాతి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.