యాప్నగరం

ఇదేమి దౌర్భాగ్యం.. మరణంలోనూ కులం వదిలిపెట్టారా?: మద్రాస్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

అణగారిన వర్గాలకు చెందిన వ్యక్తులు చనిపోతే వారిని శ్మశానంలోకి కూడా రానీయకుండా అగ్రవర్ణాలు అడ్డుకుంటున్న సంఘటనలపై మద్రాస్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

Samayam Telugu 24 Oct 2021, 3:29 pm

ప్రధానాంశాలు:

  • శ్మశానాల్లోకి అనుమతించని అగ్రవర్ణాలు.
  • గత్యంతరం లేక రోడ్డుపక్కనే అంత్యక్రియలు.
  • వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు ఆగ్రహం.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu మద్రాస్ హైకోర్టు
Madras high court
కుల వ్యవస్థ శాపం కొన్ని అణగారిన వర్గాల ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి శ్మశాన వాటికను కూడా నిరాకరిస్తుందని మద్రాస్ హైకోర్టు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ‘చనిపోయాక కూడా మనిషిని కులం వదలడం లేదు.. కులాల వారీగా శ్మశానాలున్నాయా? అగ్ర కులాలు అంత్యక్రియలు నిర్వహించే శ్మశానంలో ఇతర కులాల వారిని అనుమతించరా? అందుకు రోడ్డు పక్కనే శవాలను దహనం చేసేస్తారా? ఇదెక్కడి దౌర్భాగ్యం?’అని మద్రాస్‌ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ప్రభుత్వం కేటాయించిన శ్మశానంలో అన్ని కులాల వారి అంత్యక్రియలకు అనుమతించాల్సిందేనని, ఇందుకు భిన్నంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆనంద్‌ వెంకటేశ్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోయంబత్తూరు జిల్లా ఎరిపట్టి గ్రామానికి చెందిన అమృతవల్లి అనే మహిళ తన పొలానికి వెళ్లే దారిలో రోడ్డుపక్కనే శవాలను దహనం చేస్తున్నారంటూ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది.

ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. శ్మశానవాటికలో అంత్య క్రియలను అడ్డుకునేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ‘మరణ సమయంలోనూ కులాల అంశం విడిచిపెట్టక పోవడం చాలా దురదృష్టకరం.. ఆ వ్యక్తి అంతిమ సంస్కారాలు జరిగేంత వరకు అది అతుక్కొని ఉంటుంది’’ అని జస్టిస్ ఆనంద్ వెంకటేష్ అన్నారు. అటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని, ప్రతి ఒక్కరు కులానికి, వర్గానికి సంబంధం లేకుండా శ్మశాన వాటికలకు ప్రవేశం కల్పించాలని పేర్కొన్నారు.

ఒకవేళ అటువంటి పరిస్థితి తలెత్తినప్పుడు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ‘కులతత్వం అనేక గ్రామాల్లో అట్టడుగు వర్గాలకు చెందిన వ్యక్తులు శ్మశానవాటికలోకి అనుమతించని అసహ్యకరమైన పద్ధతి ఉంది.. తత్ఫలితంగా అణగారిన వర్గాలకు చెందిన వ్యక్తులు చనిపోతే వారి మృతదేహాలను వేరే ప్రదేశంలో దహనం చేయాల్సి వస్తుంది’ అని ఆవేదన చెందారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.