యాప్నగరం

రజనీకాంత్‌కు సమన్లు.. తమిళనాట వేడెక్కిన రాజకీయం

Tuticorin Violence: సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు మద్రాస్ హైకోర్టు సమన్లు జారీ చేసింది. తూత్తుకుడి ఘర్షణల వ్యవహారంలో ఆయనకు ఈ సమన్లు జారీ అయ్యాయి. తమిళనాట ఇది హాట్ టాపిక్‌గా మారింది.

Samayam Telugu 22 Dec 2020, 12:02 am
మిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రాజకీయం వేడెక్కింది. రాజకీయాల్లోకి వస్తున్నానంటూ కొద్ది రోజుల కిందట ప్రకటన చేసిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు సమన్లు జారీ అయ్యాయి. రెండేళ్ల కిందట తూత్తుకుడి (ట్యుటికోరన్) ఆందోళనల ఘటనపై రజనీకాంత్‌కు మద్రాస్ హైకోర్టు ధర్మాసనం మరోసారి సమన్లు జారీ చేసింది. ఇది ఆ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
Samayam Telugu రజనీకాంత్
Rajanikanth


రజనీకాంత్ చేసిన ‘అసాంఘిక శక్తుల’ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ తూత్తుకుడి కేసును దర్యాప్తు చేస్తున్న మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ జగదీశన్‌ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‌ సమన్లు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 19న కమిషన్‌ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

అసలేం జరిగింది?
తూత్తుకుడిలోని వేదాంత స్టెరిలైట్‌ రాగి కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేయాలంటూ 2018లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తమిళనాట ప్రకంపనలు రేపింది.

అప్పట్లో రజనీకాంత్‌ ఈ ఘటనపై స్పందిస్తూ.. కొన్ని అసాంఘిక శక్తులు ప్రవేశించడం వల్లే పోలీసులు కాల్పులు జరిపారని వ్యాఖ్యానించారు. రజనీ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. తన వ్యాఖ్యలపై రజనీని వివరణ కోరగా.. ఆయన సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. ‘ఎలా తెలిసిందో నన్ను అడగకండి.. నాకు అన్నీ తెలుసు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆ తర్వాత ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. అయితే.. తన వ్యాఖ్యలను మాత్రం వెనక్కి తీసుకోకపోవడం గమనార్హం.

ఈ వ్యవహారంలో ఏకసభ్య కమిషన్‌ రజనీకాంత్‌కు ఇప్పటికే ఒకసారి సమన్లు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విచారణకు హాజరుకావాలని ఆదేశించగా.. ఆ సమయంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఆలస్యమైన దర్యాప్తును మద్రాస్ హైకోర్టు ధర్మాసనం ఇటీవల మళ్లీ వేగవంతం చేసింది. రజనీకాంత్‌కు మరోసారి సమన్లు జారీ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.