యాప్నగరం

కరోనాతో గాంధీజీ ముని మనవడి కన్నుమూత.. దక్షిణాఫ్రికాలో విషాదం

South Africa: మహాత్మా గాంధీ మునిమనవడు సతీష్ ధుపేలియా దక్షిణాఫ్రికాలో కన్నుమూశారు. 66 ఏళ్ల సతీష్ న్యూమోనియాతో బాధపడుతూ హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా.. అక్కడ ఆయనకు కరోనా వైరస్ సోకింది.

Samayam Telugu 23 Nov 2020, 10:23 pm
ప్రపంచవ్యాప్తంగా తన కన్నీటి విషాదాలను కొనసాగిస్తున్న కరోనా మహమ్మారి.. జాతిపిత మహాత్మా గాంధీ మునిమనవడిని బలి తీసుకుంది. గాంధీజీ మునివనవడు సతీష్‌ ధుపేలియా కరోనాతో కన్నుమూశారు. ఆయన వయసు 66 ఏళ్లు. మూడు రోజుల కిందటే ఆయన తన 66వ పడిలోకి అడుగుపెట్టారు. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో నివాసం ఉంటున్న సతీష్‌ కొంతకాలంగా న్యూమోనియా (pneumonia) తో బాధపడుతున్నారు. నెల రోజులుగా హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు.
Samayam Telugu గాంధీజీ ముని మనవడు సతీష్ ధుపేలియా (ఫైల్ ఫోటో)
Mahatma Gandhi's Great Grandson Dies Of COVID-19 In South Africa


హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సమయంలోనే సతీష్ ధుపేలియాకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆదివారం రాత్రి అకస్మా్త్తుగా గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని సతీష్ సోదరి ఉమా ధుపేలియా-మెస్త్రీ వెల్లడించారు.

మహాత్మా గాంధీ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో దూకడానికి ముందు 20 ఏళ్ల పాటు దక్షిణాఫ్రికాలో ఉన్నారు. అక్కడ నల్ల జాతీయులపై దాడులు, వివక్షకు వ్యతిరేకంగా బ్రిటిషర్లతో పోరాడారు. దక్షిణాఫ్రికా జాతిపితగా పేర్కొనే నెల్సన్ మండేలా కూడా గాంధీజీ స్ఫూర్తితోనే తన పోరాటం కొనసాగించారు. దక్షిణాఫ్రికా ప్రజల హృదయాల్లో గాంధీజీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలో గాంధీజీ వారసులు అక్కడ పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.

సతీష్‌ ధుపేలియా తన సోదరి ఉమా ధుపేలియాతో పాటు మరో సోదరి కీర్తి మీనన్‌తో పాటు జోహన్నెస్‌బర్గ్‌లో నివాసం ఉంటున్నారు. వీరు ముగ్గురూ గాంధీజీ సోదరుడు మనీలాల్ గాంధీ సంతానం. వీరందరికీ సౌతాఫ్రికా పౌరసత్వం ఉంది. గాంధీజీ ట్రస్టు ద్వారా అక్కడ పలు డెవలప్‌మెంట్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

సతీష్ ధుపేలియా సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. నిరుపేదలకు సహాయం అందించడంలో ఆయన అన్ని వర్గాల మన్నన పొందారు. 1860 హెరిటేజ్ ఫౌండేషన్ బోర్డు సభ్యులుగానూ ఉన్నారు. వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీలో ప్రావీణ్యం ఉన్న సతీష్.. ఎక్కువ సమయం మీడియాకు కేటాయించేవారు. సతీష్ మృతి పట్ల దక్షిణాఫ్రికా ప్రజలు, ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Also Read: కరోనా పాజిటివ్ వ్యక్తి చిన్న అబద్ధం.. రాష్ట్రమంతా లాక్‌డౌన్‌!

Also Read: మాజీ సీఎం తరుణ్ గొగొయి కన్నుమూత.. కరోనా నుంచి కోలుకున్నా!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.