తన స్కర్టు వ్యాఖ్యలను ఎవరినీ అవమానించే ఉద్దేశంతో చేయలేదని కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ స్పష్టం చేశారు. ఇటీవల ఆయన విదేశీ మహిళలు భారత్ లో స్కర్టులు ధరించరాదని అన్నట్లు మీడియాలో వచ్చిన కథనాలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. మహిళల వస్త్రధారణ గురించి సలహాలివ్వడానికి మంత్రి ఎవరని అంతా విమర్శలకు దిగారు. దాంతో మహేశ్ శర్మ తన కామెంట్లకు వివరణ ఇచ్చుకున్నారు. తన వ్యాఖ్యల ఉద్దేశం వేరని కానీ అది తప్పుగా ప్రజల్లోకి వెళ్లిందన్నారు. మతపరమైన ప్రాంతాల వద్ద మాత్రమే మహిళలు స్కర్టులు ధరించరాదని తాను సలహా ఇచ్చినట్లు తెలిపారు. రాత్రి వేళల్లో కూడా మహిళా పర్యాటకులు జాగరూకతతో వ్యవహరించాలని తాను చెప్పానని, అందులో తప్పేమిటో అర్థం కావడం లేదన్నారు. భారతదేశం అంటే సంస్కృతీ సంప్రదాయాలకు పెద్ద పీట వేసే మహోన్నతదేశమని, దేవాలయాల వద్ద ప్రత్యేక డ్రెస్ కోడ్లు ఉంటాయని అందరికి తెలుసన్నారు. దాన్ని గుర్తించి మసలుకోవాలని మాత్రమే తాను సూచించానన్నారు.
నా స్కర్టు వ్యాఖ్యల ఉద్దేశం అది కాదు
తన స్కర్టు వ్యాఖ్యలను ఎవరినీ అవమానించే ఉద్దేశంతో చేయలేదని కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ స్పష్టం చేశారు
TNN 30 Aug 2016, 5:22 pm