యాప్నగరం

దారుణం.. తండ్రికి తలకొరివి పెట్టాలంటే రూ.లక్ష ఇవ్వాలన్న కొడుకు

రోజు రోజుకూ మానవ సంబంధాలు అడుగంటిపోతున్నాయి. మనిషిలో మానవత్వం కుచించుకుపోతుంది. కన్న తండ్రి చితికి నిప్పంటించాలంటే తనకు రూ.లక్ష ఇవ్వాలని ఓ కొడుకు డిమాండ్ చేశాడు.

Samayam Telugu 11 Jan 2020, 9:21 am
కని పెంచిన తల్లిదండ్రులనే పట్టించుకోని పిల్లలు, చివరకు వారు చనిపోయిన తర్వాత కూడా అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ముందుకురాని ఉదంతాలు ఇటీవల కాలంలో వెలుగుచూస్తున్నాయి. తాజాగా, ఓ కుమారుడు తన తండ్రికి తలకొరివి పెట్టాలంటే రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ ఉదంతం ఒడిశాలోని భద్రక్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రక్‌ జిల్లా బజరాపూర్‌కు చెందిన అనామచరణ్‌ బందు ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేశాడు. ఆయనకు ఓ కుమారుడు ఉండగా, అనారోగ్యంతో భార్య కన్నుమూసింది. భార్య మృతి చెందిన తర్వాత కుమారుడు, కోడలు ఆయనను వేధింపులకు గురిచేయడంతో స్నేహితుడి ఇంటికి చేరాడు. గత 17 ఏళ్లుగా స్నేహితుడు గజేంద్ర సాహు ఇంట్లో ఆయన కాలం వెళ్లదీస్తున్నాడు.
Samayam Telugu money


వయసు పైబడటంతో కొద్ది రోజుల కింద అనారోగ్యానికి గురయిన బందు గురించి కుమారుడికి సమాచారం ఇచ్చినా అతడు స్పందించలేదు. ఈక్రమంలో ఆరోగ్యం విషమించడంతో అనామచరణ్‌ బుధవారం రాత్రి మృతి చెందారు. దీని గురించి ఆయన కుమారుడికి గజేంద్ర సాహు చెప్పి అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. అయితే, దీనికి అతడు నిరాకరించడమే కాదు, తనకు డబ్బులివ్వాలని కోరాడు. అంతేకాదు, గత 17 ఏళ్లుగా మా నాన్న పెన్షన్ తీసుకుంటున్నారు... రూ.లక్ష ఇస్తేనే తలకొరివి పెడతానని సమాధానమిచ్చాడు. దీంతో పోలీసులకు గజేంద్ర సాహు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో అనామచరణ్‌ కుమారుడిని పిలిపించిన పోలీసులు.. అతడితో చర్చించి తండ్రి అంత్యక్రియలు జరిపించడానికి ఒప్పించారు. పోలీసుల జోక్యంతో చివరకు తండ్రికి తలకొరివి పెట్టాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.