యాప్నగరం

మావోల మెరుపు దాడి.. ముగ్గురు జవాన్లు, బాలిక మృతి

సీఆర్‌పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు మెరుపుదాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లతో పాటు ఓ సివిలియన్ మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Samayam Telugu 29 Jun 2019, 9:47 pm
త్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి పేట్రేగిపోయారు. బీజాపూర్ జిల్లాలో జవాన్లపై మెరుపుదాడి చేశారు. మావోల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. జన సంచారం ఉన్న ప్రాంతంలో కాల్పులు జరపడంతో బుల్లెట్ గాయాల పాలై ఓ బాలిక మృతి చెందగా మరో బాలిక తీవ్రంగా గాయపడింది. జవాన్లు ఎదురు కాల్పులకు దిగడంతో మావోయిస్టులు అరణ్యంలోకి పారిపోయినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం (జూన్ 28) ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
Samayam Telugu maoist
మావోయిస్టుల దాడి


బీజాపూర్ జిల్లాలోని కేశ్‌కుతుల్ నుంచి సీఆర్పీఎఫ్ 199 బెటాలియన్‌కు చెందిన జవాన్లు శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో బైరాంగఢ్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలోని దేవాంగణ్ పులియా ప్రాంతంలో జనసంచారం ఉన్న ఓ ప్రాంతంలో మాటువేసిన మావోయిస్టులు ఒక్కసారిగా జవాన్లపై కాల్పులకు దిగారు.

మావోయిస్టులను ఎదిరిస్తూ సీఆర్పీఎఫ్ ఏఎస్సై మహాదేవ్ కాల్పులు జరుపుకొంటూ ఎదురుగా వెళ్లారు. బుల్లెట్లు తగటడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలో కోల్పోయారు. జవాన్ల కాల్పుల ధాటికి తాళలేక మావోయిస్టులు దట్టమైన అటవీ ప్రాంతంలోకి పారిపోయారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఏఎస్సై మదన్‌లాల్, హెడ్ కానిస్టేబుల్ సాజిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. కాల్పులు జరుగుతున్న సమయంలో ఐదుగురు సివిలియన్లతో కూడిన ఓ ప్రైవేట్ వాహనం ఆ మార్గం మీదుగా వచ్చింది. క్రాస్‌ ఫైరింగ్‌లో బుల్లెట్లు తగటడంతో వాహనంలో ఉన్న తేలం (14) అనే బాలిక మరణించింది. మరో బాలిక రింకీ హేమ్లాకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాల్పుల విరమణ తర్వాత భద్రతా బలగాలు ఘటనా స్థలిని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. జవాన్ల వద్ద నుంచి ఒక ఏకే 47, బుల్లెట్లు, ఒక వైర్‌లెస్ సెట్, ఒక బీపీ జాకెట్ పోయినట్లు అధికారులు తెలిపారు.

అటు రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని కాంకేర్, మహారాష్ట్రలోని గడ్చీరోలి జిల్లాల సరిహద్దుల మధ్య ఉన్న కోయ్‌కటోలి ప్రాంతంలో మావోయిస్టుల బేస్‌క్యాంప్‌పై భద్రతా బలగాలు దాడి చేశాయి. మావోయిస్టులకు, జవాన్లకు మధ్య చాలాసేపటి వరకూ భీకర ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టులు దట్టమైన అరణ్యంలోకి పారిపోయారు. ఘటన స్థలంలో రక్తపు మరకలు ఉండడాన్ని బట్టి మావోయిస్టులు గాయపడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.