యాప్నగరం

పాస్‌పోర్టులపై బీజేపీ సింబల్.. క్లారిటీ ఇచ్చిన విదేశాంగ శాఖ

కొత్తగా జారీ చేస్తోన్న పాస్‌పోర్టుల మీద బీజేపీ సింబల్ లోటస్ ఉండటం పట్ల కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాాగా ఈ విషయమై విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది.

Samayam Telugu 12 Dec 2019, 10:54 pm
కొత్త పాస్‌పోర్టులపై కమలం గుర్తు ముద్రిస్తున్నారంటూ వస్తోన్న విమర్శలపై విదేశాంగ శాఖ స్పందించింది. లోక్ సభలో ప్రతిపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాలపై కేంద్రం వివరణ ఇచ్చింది. జాతీయ చిహ్నాల్లో ఒకటైన కమలంను కొత్త పాస్‌పోర్టులపై ముద్రించామని విదేశాంగ శాఖ తెలిపింది. భద్రతా చర్యల్లో భాగంగా ఫేక్ పాస్‌పోర్టుల సమస్యను అధిగమించడం కోసం ఈ చర్యలు తీసుకున్నామంది. ముందుగా కమలం గుర్తును ముద్రించామని.. రొటేషన్‌ పద్ధతిలో మిగతా జాతీయ చిహ్నాలను ఉపయోగిస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది.
Samayam Telugu passport


కొత్త పాస్‌పోర్టులపై లోటస్ సింబల్‌ను ముద్రించిన విషయమై కాంగ్రెస్ ఎంపీ ఎంకే రాఘవన్ బుధవారం లోక్ సభ జీరో అవర్‌‌లో అభ్యంతరం లేవనెత్తారు. కేరళలోని కోజికోడ్‌లో అలాంటి పాస్‌పోర్టులను జారీ చేస్తున్నారన్నారు. కమలం గుర్తు బీజేపీ ఎన్నికల గుర్తు కావడంతో ఈ వ్యవహరం వివాదాస్పదమైంది.

కాంగ్రెస్ ఎంపీ ఆరోపణల పట్ల విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ గురువారం స్పందించారు. కమలం అనేది మన జాతీయ పుష్పం అని.. ఫేక్ పాస్‌పోర్టులను గుర్తించడం కోసం అదనపు భద్రతా ఫీచర్లలో భాగంగా దాన్ని పాస్‌పోర్టుపై ముద్రించామన్నారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ భద్రతా చర్యలు చేపట్టామన్నారు. ఇప్పుడు కమలం వాడాం.. వచ్చే నెలలో జాతీయ జంతువు లేదా మరో చిహ్నాన్ని వాడుతామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.