యాప్నగరం

మోదీ అనూహ్య చర్య.. భద్రతా సిబ్బంది టెన్షన్

రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి, అతిథులు వేదిక దిగిపోయాక ప్రధాని మోదీ చేసిన అనూహ్య చర్యతో భద్రతా సిబ్బంది టెన్షన్ పడ్డారు.

TNN 26 Jan 2018, 3:26 pm
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ రాజ్‌పథ్‌లో భద్రతా సిబ్బందిని కాసేపు టెన్షన్ పెట్టారు. సెక్యూరిటీ ప్రొటోకాల్‌ను పక్కనబెట్టిన మోదీ రిపబ్లిక్ డే వేడుకల్ని వీక్షించేందుకు రాజ్‌పథ్ వచ్చిన భారీ జనసమూహానికి చేరువగా వెళ్లారు. రిపబ్లిక్ డే పరేడ్ తర్వాత రాష్ట్రపతి రాజ్‌నాథ్ కోవింద్, ఆసియాన్ దేశాల అధినేతలు వేదికపై నుంచి వెళ్లిపోయారు. వెంటనే నడుచుకుంటూ కిందకు వెళ్లిన మోదీ.. జనాలకు అభివాదం చేస్తూ ఇండియా గేట్ వరకు వెళ్లారు.
Samayam Telugu modi breaks security protocol at rajpath
మోదీ అనూహ్య చర్య.. భద్రతా సిబ్బంది టెన్షన్


ప్రధానిని అత్యంత సమీపం నుంచి చూసిన ఆనందంలో వేడుకల్ని తిలకించడానికి వచ్చిన జనాలు మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో మోదీ అలా నడుచుకుంటూ వెళ్తుంటే చూడటం సామాన్యులకు బాగానే ఉంది. కానీ భద్రతా సిబ్బంది మాత్రం అనూహ్య పరిణామానికి షాకయ్యారు. వెంటనే తెరుకొని ఆయన్ను అనుసరించారు. ప్రధానితో నడవడానికి జనం ఆసక్తి చూపడంతో వారిని నియంత్రించడం భద్రతా సిబ్బందికి కష్టమైంది. మోదీకి రక్షణగా నిలవడానికి ఎస్పీజీ గార్డులు తీవ్రంగా శ్రమించారు.

గతంలో ప్రధానులు బుల్లెట్ ప్రూఫ్ అద్దం వెనుక నిల్చొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేవారు. కానీ ప్రధానిగా ఎన్నికైన ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. మోదీ బుల్లెట్ ప్రూఫ్ అద్దం నుంచి బయటకు వచ్చి మాట్లాడారు. తీవ్రవాదుల నుంచి ముప్పు ఎదురయ్యే అవకాశం ఉండటంతో భద్రతా సిబ్బంది అప్పుడు కూడా టెన్షన్ పడ్డారు. వీఐపీ గ్యాలరీలో కూర్చున్నవారు కుర్చీల మీద నిలబడి మోదీని ఫొటోలు తీయడానికి ప్రయత్నించారు. ప్రధానిని ఫొటోలు తీయొద్దని భద్రతా సిబ్బంది సూచించారు.

#WATCH Delhi: PM Narendra Modi greets people after #RepublicDay parade pic.twitter.com/TtACMHS6hd — ANI (@ANI) January 26, 2018
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాజ్‌పథ్ పరిసరాల్ని భద్రతా సిబ్బంది తమ గుప్పిట్లోకి తీసుకుంటారు. వివిధ అంచెల్లో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తారు. ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు తలెత్తకుండా వేడుకలు ప్రశాతంగా ముగిసే వరకు వేలాది మంది భద్రతా సిబ్బంది నిత్యం పహారా కాస్తారు. వేడుకలు నిర్వహించే ప్రాంతంలో వెయ్యికిపైగా కెమెరాలను ఏర్పాటు చేస్తారు. పారామిలటరీ, ఆర్మీ బలగాలు కూడా రంగంలోకి దిగుతాయి. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకూ పరేడ్ జరిగే మార్గంలోని భవనాలను మూసేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.