యాప్నగరం

ఫలించిన మోదీ మంత్రాంగం.. డీఎంకే సైలెంట్!

పాకిస్థాన్ ప్రధాని పుట్టినరోజుకు హాజరై ఆశ్చర్యం కలిగించినా, తమపై కారాలు మిరియాలు నూరుతోన్న పార్టీల్లో ఒకటైన డీఎంకే అధినేతను హఠాత్తుగా పరామర్శించి ప్రసన్నం చేసుకున్నా అది ప్రధాని రాజకీయ చతురతకు నిదర్శనం.

TNN 8 Nov 2017, 12:39 pm
ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో బాగా తెలిసిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ. పాకిస్థాన్ ప్రధాని పుట్టినరోజుకు హాజరై ఆశ్చర్యం కలిగించినా, తమపై కారాలు మిరియాలు నూరుతోన్న పార్టీల్లో ఒకటైన డీఎంకే అధినేతను హఠాత్తుగా పరామర్శించి ప్రసన్నం చేసుకున్నా అది ఆయన రాజకీయ చతురతకు నిదర్శనం. రెండు రోజుల కిందట తమిళనాడులో పర్యటించిన ప్రధాని మోదీ, ఎవరూ ఊహించని విధంగా కరుణానిధిని పరామర్శించారు. తమిళనాట అడుగుపెట్టాలని భావిస్తున్న బీజేపీ... అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. ఓ వైపు అన్నాడీఎంకేతో సఖ్యతగానే ఉంటూ, మరోవైపు డీఎంకేకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది.
Samayam Telugu modi visit karunanidhi house and dmk back step on anti demonetization day
ఫలించిన మోదీ మంత్రాంగం.. డీఎంకే సైలెంట్!


ఈ నేపథ్యంలో, రెండు రోజుల క్రితం చైన్నై వెళ్లిన మోదీ... డీఎంకే అధినేత కరుణానిధి నివాసానికి వెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను పరామర్శించారు. అంతేకాదు, "మీరు ఢిల్లీ వచ్చి నా అధికార నివాసంలో ఉంటారా? నా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటారా?" అంటూ కరుణను అడిగారు. మోదీ మాటలకు కరుణ చిరుమందహాసం చేశారు. ఇదే సమయంలో కరుణ భార్య దయాళు అమ్మాళ్‌ను కూడా ప్రధాని పరామర్శించారు. కరుణ కుమారుడు స్టాలిన్ చేయిపట్టుకుని నడుస్తూ, పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో కరుణ కుమార్తె కనిమొళి కూడా పక్కనే ఉన్నారు.

ఈ వ్యవహారం భవిష్యత్తు అవసరాలను తెలియజేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఢిల్లీ వచ్చి తన నివాసంలో విశ్రాంతి తీసుకోమనడం వెనుక రాజకీయ కోణం దాగి ఉందని వారు పేర్కొంటున్నారు. 2004 వరకు ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న డీఎంకే, తర్వాత యూపీఏలో చేరింది. తమిళనాట రాజకీయంగా ఎదగడానికి డీఎంకేతో పొత్తు బీజేపీకి అవసరం కాగా... కేసుల నుంచి బయటపడటానికి బీజేపీతో చెలిమి డీఎంకేకు అత్యవసరమని విశ్లేషకులు అంటున్నారు. కనిమొళి, దయాళు అమ్మాళ్, కరుణ బంధువర్గం, సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ తదితరులు నిందితులుగా ఉన్న 2జీ స్పెక్ట్రం కేసు కొద్ది రోజుల్లోనే తుది విచారణకు రానుంది. ఏదేమైనప్పటికీ, మోదీ రాజకీయ మంత్రాంగం ఫలించింది.

పెద్ద నోట్లు రద్దుచేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ రోజు విపక్షాలు నిర్వహించ తలపెట్టిన వ్యతిరేక ప్రదర్శనలను డీఎంకే కొన్ని చోట్ల విరమించుకుంది. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ప్రదర్శనలు భారీ వర్షాలు కారణంగా ఆరు జిల్లాల్లో నిలిపివేసినట్లు డీఎంకే ప్రకటించింది. చెన్నై, కాంచీపురం, నాగపట్టణం, కడలూరు, వెల్లూరు, తిరువరూర్, తిరువణ్ణామలై, విల్లుపురం జిల్లాల్లో నల్లధనం వ్యతిరేక ప్రదర్శనలు నిలివేస్తామని ప్రకటించింది. అయితే తిరువణ్ణామలై, విల్లుపురం జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో అక్కడ కూడా ఆందోళనలు చేపట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.