యాప్నగరం

Chennai ఫెడ్ బ్యాంకు దోపిడీలో భారీ ట్విస్ట్.. ఎస్ఐ ఇంట్లోనే చోరీకి గురైన బంగారం!

దొంగలతో పోలీసులు చేతులు కలిపి చోరీ సొత్తును పంచుకున్న మరో ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. గతవారం చెన్నైలోని ఫెడరల్ బ్యాంకు అనుబంధం బ్యాంకులోని చోరీకి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దోపిడీ సమయంలో దాదాపు 32 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. అయితే, దొంగల ముఠాతో ఎస్ఐ కుమ్ముక్కయినట్టు తాజాగా తెలిసింది. ముఠాలోని ఒకరు అతడికి బంధువే కావడం మరో ట్విస్ట్. అతడు ఇచ్చిన సమాచారంతోనే పోలీస్ గుట్టు బయటపడింది.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 18 Aug 2022, 7:53 pm

ప్రధానాంశాలు:

  • రూ.15 కోట్ల విలువైన బంగారం దోపిడీ
  • 32 కిలోల గోల్డ్‌ను సీజ్ చేసిన పోలీసులు.
  • ఎస్ఐ బంధువు దోపిడీ ముఠా సభ్యుడి.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu చెన్నై దోపిడీ
చెన్నైలోని ఫెడ్ బ్యాంకు దోపిడీ కేసులో (Chennai Fedbank Robbery) ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. దొంగలతో పోలీస్ చేతులు కలిపి తన వాటాను తీసుకోవడం గమనార్హం. ఈ దోపిడీలో ఓ పోలీస్ అధికారి హస్తం కూడా ఉందని తెలియడంతో ఖాకీలే విస్తుపోయారు. అరుంబాక్కం ఫెడ్ బ్యాంకులో (Fedbank gold heist) గతవారం భారీ దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 30 కిలోలకుపైగా బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. తాజాగా, చోరీకి గురైన బంగారంలోని 3.5 కిలోలు అచరపక్కం ఇన్‌స్పెక్టర్ అమల్‌రాజ్ (SI Amalraj) ఇంట్లో లభ్యమయ్యింది. దీంతో ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అమల్‌రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. దోపిడీకి పాల్పడిన దొంగలతో అమల్‌రాజ్‌ కాంటాక్ట్‌లో ఉన్నట్లు కూడా విచారణలో తేలింది.
ఈ కేసులో సంతోష్, బాలాజీ అనే ఇద్దరి అనుమానితుల్ని అరెస్ట్ చేయగా.. తాము దోపీడీ చేసిన సొత్తులో కొంత అమల్‌రాజ్ ఇంట్లో దాచిపెట్టినట్టు తెలిపారు. ఇన్-స్పెక్టర్ అమల్‌రాజ్‌కు సంతోష్ బంధువు కావడం గమనార్హం. కాగా, ఫెడ్ బ్యాంకు దోపిడీ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 14 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

దోపిడీ జరిగిన వెంటనే సూర్య అనే వ్యక్తి 14 కిలోల బంగారు నగలతో కోయంబత్తూరు వెళ్లి, అక్కడి ఆర్‌ఎస్‌పురంలోని ఓ నగల దుకాణంలో కరిగించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో తక్షణమే స్పందించిన పోలీసులు.. ఆ నగల దుకాణం యజమానిని అరెస్టు చేసి, సూర్య నుంచి 14 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ ఇంటిలో లభ్యమైన సొత్తుతో దోపిడీకి గురైన మొత్తం నగలు స్వాధీనమైనట్లు గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌జివాల్‌ (Chennai Police Commissioner) ప్రకటించారు.

దోపిడీ కేసును సమర్థవంతంగా విచారణ జరిపి 48 గంటల్లోనే ప్రధాన నిందితులందరినీ అరెస్టు చేసిన ప్రత్యేక దళాన్ని ఆయన అభినందించారు. ఒకటి రెండు రోజుల్లోగా మరో ఇద్దరిని కూడా అరెస్టు చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాంక్ దోపిడీలో ప్రధాన సూత్రధారి మురుగన్ మంగళవారం అరెస్ట్ కాగా.. అతడిని రహస్యంగా విచారిస్తున్నారు. ఈ దోపిడీలో ఏడుగురు కాకుండా ఇంకా ఎవరికైనా సంబంధాలున్నాయేమోనని ఆరా తీస్తున్నారు. నిందితుడు సంతోష్, బాలాజీలకు ఎగ్మోర్ ఐదో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది.
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.