యాప్నగరం

జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో ఉగ్రమూకల కదలికలపై సైన్యం డేగ కళ్లతో నిఘా ఉంచింది. మారణహోమానికి ప్రయత్నిస్తున్న ముష్కరుల కుట్రలను సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు సమర్ధంగా తిప్పికొడుతున్నారు.

Samayam Telugu 4 Apr 2020, 11:38 am
జమ్మూ కశ్మీర్‌‌లో భద్రత దళాలు, ఉగ్రవాదుల మధ్య శనివారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ముష్కరులు హతమయ్యారు. కుల్గామ్ జిల్లా హర్దమంగూరి బతాపొరా వద్ద ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా దళాలు అక్కడకు చేరుకున్నాయి. ఇండియన్ ఆర్మీ రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో భద్రత దళాలపై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు జరపడంతో ఇరు వర్గాల మధ్య హోరాహోరీ పోరు నెలకుంది. ఈ ప్రాంతంలో మొత్తం ఏడుగురు ఉగ్రవాదులు నక్కినట్టు సైన్యం గుర్తించింది. ఎదురు కాల్పుల్లో ఓ జవాన్ గాయపడినట్టు అధికారులు వెల్లడించారు.
Samayam Telugu dsp


వీరిలో నలుగురు ఉగ్రవాదులను హతమార్చగా, ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదులను కుల్గామ్‌లోని డీహెచ్ పొరాకు చెందిన ఫయాజ్, అదిల్, మహమ్మద్ షాహిద్‌గా గుర్తించారు. సైన్యం ఎదురుకాల్పుల్లో హతమైన ఉగ్రవాదులకు బుధవారం రాత్రి కుల్గామ్‌ జిల్లా నందిమార్గ్‌లో జరిగిన ఇద్దరు పౌరుల హత్య కేసుతో సంబంధం ఉందని జమ్మూ కశ్మీర్ పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. నందిమార్గ్‌కు చెందిన సిరాజ్ అహ్మద్ గోర్సే, గులాం హసన్ అనే యువకులను ఉగ్రవాదులు బుధవారం రాత్రి హతమార్చారు.

గతేడాది ఆగస్టు 5న కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కేంద్రం రద్దు చేసిన తర్వాత లోయలో విధ్వంసం సృష్టించడానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వీటిని సైన్యం సమర్ధవంతంగా తిప్పికొడుతోంది. దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలపై డేగ కళ్లతో నిఘా ఉంచి, ఎప్పటికప్పుడు వారి కుట్రలను భగ్నం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.