యాప్నగరం

మెట్రో పిల్లర్ కూలి మహిళ, కుమారుడు మృతి.. భర్త, కుమార్తెకు గాయాలు

Bengaluru Metro: ఇండియన్ సిలికాన్ వ్యాలీ ‘బెంగళూరు’ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి బైక్‌పై వెళ్తున్న దంపతులపై పడింది. ఈ ప్రమాదంలో బైక్ వెనకాల కూర్చున్న తల్లీ, కుమారుడు మృతి చెందగా.. తండ్రి, కుమార్తె గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. బాధిత కుటుంబానికి బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ రూ. 20 లక్షల పరిహారం ప్రకటించింది.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 10 Jan 2023, 5:46 pm
మెట్రో పిల్లర్ కూలి తల్లీ, కుమారుడు దుర్మరణం పాలయ్యారు. తండ్రి, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరులోని నగవర ప్రాంతంలో మంగళవారం (జనవరి 10) ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బెంగళూరుకు చెందిన తేజస్విని, లోహిత్ దంపతులు తమ చిన్నారులతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. కళ్యాణ్ నగర్, హెఆర్‌బీఆర్ మార్గంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ అకస్మాత్తుగా కూలి వారి బైక్‌పై పడింది. మెట్రో పిల్లర్ శిథిలాలు నేరుగా బైక్ వెనకాల కూర్చున్న తేజస్విని, ఆమె చేతిలో ఉన్న రెండున్నరేళ్ల వారి కుమారుడు విహాన్‌పై పడ్డాయి. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన తేజస్విని భర్త లోహిత్, కుమార్తె ‌ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.
Samayam Telugu Metro pillar accident
బెంగళూరు మెట్రో పిల్లర్ ప్రమాదం


మెట్రో పిల్లర్‌ నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోలేదని లోహిత్ తండ్రి విజయకుమార్ అన్నారు. నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Watch: The moment when under-construction pillar collapses in Bengaluru

బెంగళూరు దంపతులు


ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై స్పందించారు. ఘటనకు గల కారణాలపై విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. బాధిత కుటుంబానికి పరిహారం అందజేస్తామని చెప్పారు. బాధిత కుటుంబానికి బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ రూ. 20 లక్షల పరిహారం ప్రకటించింది.

ఇటీవల మహారాష్ట్రలోనూ ఇదే తరహా విషాదం చోటు చేసుకుంది. థాణేలోని ఓ మాల్‌ సమీపంలో మెట్రో పిల్లర్‌కు అమర్చిన ఐరన్ రాడ్ విరిగి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.