యాప్నగరం

థియేటర్ల ఆటకట్టు.. ఇకపై ఫుడ్ ఐటెమ్స్ తీసుకెళ్లొచ్చు

సినిమాా హాళ్లలో ఇష్టారాజ్యంగా సాగుతున్న వసూళ్లను అడ్డుకునేవారే లేరా? ఇది సగటు పౌరుడి ప్రశ్న. ఈ దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం ఓ ముందడుగేసింది. సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

Samayam Telugu 13 Jul 2018, 3:55 pm
సరదాగా గడుపుదామని సినిమా చూడటానికి వెళ్తే పార్కింగ్ రుసుములతో మొదలుపెట్టి ఫుడ్ ఐటెమ్స్ వరకూ అధిక మొత్తం వసూలు చేస్తూ వినియోగదారుల నుంచి డబ్బులు పిండుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా సాగుతున్న వసూళ్లను అడ్డుకునేవారే లేరా అనేది సగటు పౌరుడి ప్రశ్న. ఈ దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం ఓ ముందడుగేసింది. సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా చూడటానికి వెళ్లేవాళ్లు తమ వెంట ఆహార పదార్థాలను తీసుకొని వెళ్లొచ్చని స్పష్టం చేసింది. తద్వారా థియేటర్లలో విక్రయించే ఫుడ్ ఐటెమ్స్ రేట్లలో గణనీయ తగ్గుదల కనిపించే అవకాశాలున్నాయి. ఆగస్టు 1 నుంచి అన్ని రకాల సినిమా హాళ్లు ఈ నిబంధనను పాటించాలని సూచించింది.
Samayam Telugu food


ఒకవేళ సినిమా థియేటర్లు ఈ నిబంధనను పాటించకుంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైనా మహారాష్ట్ర ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించాలనే యోచనలో ఉంది. ఈ వివరాలను ఆ రాష్ట్ర ఆహార శాఖ మంత్రి రవీంద్ర చావన్ మీడియాకు తెలిపారు. ఫుడ్ ఐటమ్స్‌తో సినిమాకు వెళ్తున్నవారిని ఇకపై ఎవరైనా అడ్డుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఒకే ఉత్పత్తి (ప్రొడక్ట్)కి వేర్వేరు రేట్లు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.

థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో చాలా కాలంగా ఆహార పదార్థాలను అధిక ధరలకు అమ్ముతున్నారు. దీనికి వ్యతిరేకంగా మహారాష్ట్రలో తీవ్రమైన నిరసన వ్యక్తమవుతోంది. ఈ అంశంపై ఇటీవల పుణేలో ఎంఎన్‌ఎస్ కార్యకర్తలు ఓ థియేటర్ మేనేజర్‌పై దాడి చేసి చితకబాదారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయమే తీసుకోవాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.