యాప్నగరం

ఫోర్జరీ సంతకాలతో ఖాతాల నుంచి లక్షలు కాజేసిన క్యాషియర్!

ఫోర్జరీ సంతకాలతో ఖాతాదారులకు చెందిన లక్షలు బ్యాంకు క్యాషియర్ కొట్టేసిన వ్యవహారం వెలుగుచూసింది. బ్యాంకు అంతర్గత అడిట్‌‌లో క్యాషియర్ బండారం బయటపడింది.

Samayam Telugu 15 Oct 2018, 1:39 pm
ఫోర్జరీ సంతకాలతో ఖాతాదారులకు చెందిన రూ.28 లక్షలు బ్యాంకు క్యాషియర్ కొట్టేసిన వ్యవహారం ముంబైలో వెలుగుచూసింది. బ్యాంకు అంతర్గత అడిట్‌‌లో క్యాషియర్ బండారం బయటపడింది. నలాస్‌పొరా మున్సిపల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ క్యాషియర్ అంకుశ్ రహాతే (43) గత మూడేళ్లుగా 51 మంది కస్టమర్ల ఖాతాల నుంచి ఫోర్జరీ సంతకాలతో రూ.28 లక్షలు కాజేసినట్టు గుర్తించారు. ఆడిట్‌ సమయంలో కొన్ని లావాదేవీలకు పొంతనలేకపోవడంతో బ్రాంచ్ మేనేజర్ రాజేంద్ర జాదవ్ అనుమానించారు. తక్షణమే నగదు ఉపసహరించిన ఖాతాదారులకు ఫోన్ చేశాడు. అయితే, తాము ఎలాంటి నగదు ఉపసంహరణ చేయలేదంటూ ఖాతాదారులు పేర్కొన్నారు. బీర్బల్ షా అనే మహిళ తన ఖాతా నుంచి రోజు తప్పించి రోజు రూ.20,000 నగదు విత్‌డ్రా చేసినట్టు ఆవర్జాలో పేర్కోవడంతో ఆమెను బీఎం సంప్రదించారు.
Samayam Telugu money


అయితే, తాను గత కొద్ది రోజులుగా నగదు విత్ డ్రా చేయలేదని చెప్పడంతో మేనేజర్ అనుమానం మరింత బలపడింది. దీంతో పోలీసులకు ఆయన సమాచారం ఇచ్చారు. బీఎం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు క్యాషియర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. మొత్తం 51 ఖాతాల నుంచి దొంగ సంతకాలతో రూ.28 లక్షలు నగదు తీసుకున్నట్టు అంగీకరించాడు. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు అంకుశ్‌ను అరెస్ట్ చేశారు. మూడేళ్లుగా ఈ తతంగం జరుగుతున్నా ఒక్కరు కూడా ఫిర్యాదు చేయకపోవడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.