యాప్నగరం

Wedding హిందూ ఆలయంలో ముస్లిం జంట వివాహం

Wedding కేరళకు చెందిన ఓ హిందూ జంట.. మసీదులో వివాహం చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా అప్పట్లో సంచలనంగా మారింది. ఇది మూడేళ్ల కిందట జరిగిన ఘటన.. అయితే, ఓ ముస్లిం జంట హిందూ ఆలయంలోనే తమ వివాహం చేసుకుని మతసామరస్యాన్ని చాటారు. ఆలయం కూడా ఈ వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసింది. అంతేకాదు, ఇది ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యాలయం కావడం గమనార్హం. ఈ ఘటన హిమాచల్ రాష్ట్రంలోని సిమ్లా జిల్లాలో చోటుచేసుకుంది.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 7 Mar 2023, 6:39 am
Wedding హిందూ-ముస్లిం (Hindu Muslim) ఐక్యతను మరోసారి చాటిచెప్పిన ఘటన ఇది. హిందూ ఆలయంలో (Hindu Temple) ఓ ముస్లిం జంట వివాహం (Muslim Couple Marriage) చేసుకుని మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. హిమాచల్ ప్రదేశ్‌లోని (Himachal Pradesh) సిమ్లా (Shimla) జిల్లా రామ్‌పూర్ హిందూ ఆలయంలో ఈ వివాహం జరిగింది. అంతేకాదు, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్వంలోని ఠాకూర్ సత్యన్నారాయణ ఆలయంలోనే (Thakur Satyanarayana Swamy Temple) ఈ వివాహం జరగడం విశేషం. అలాగే, ఈ వివాహా వేడుకకు హిందువులు, ముస్లింలు హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. మౌల్వీ, సాక్షులు, లాయర్ సమక్షంలోనే ఈ పెళ్లి జరిగింది. మతసామరస్యం, సౌభ్రాతృత్వ సందేశాన్ని ప్రజలకు తెలియజేయడమే ఆలయ ప్రాంగణంలో వివాహం ముఖ్య ఉద్దేశమని స్థానికులు పేర్కొన్నారు.
Samayam Telugu Muslim wedding


సత్యన్నారాయణ ఆలయ సముదాయం విశ్వహిందూ పరిషత్ (VHP), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) జిల్లా కార్యాలయం కావడం గమనార్హం. ఠాకూర్ సత్యన్నారాయణ ఆలయ ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ వినయ్ శర్మ మాట్లాడుతూ.. ‘ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను విశ్వ హిందూ పరిషత్ చూస్తోంది.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జిల్లా కార్యాలయం కూడా ఇదే.. విశ్వహిందూ పరిషత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌లు తరచూ ముస్లింలకు వ్యతిరేకమని ఆరోపిస్తున్నారు.. అయితే ఇక్కడ ఓ ముస్లిం జంట హిందూ దేవాలయ ఆవరణలో పెళ్లి చేసుకున్నారు. సనాతన ధర్మం ఎల్లప్పుడూ అందరినీ కలుపుకొని ముందుకు సాగేలా ప్రేరేపిస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ’ అని చెప్పారు.

వధువు తండ్రి మహేంద్ర సింగ్ మాలిక్ మాట్లాడుతూ.. ‘‘రాంపూర్‌లోని సత్యనారాయణ ఆలయ ప్రాంగణంలో కుమార్తె వివాహం జరిగింది.. విశ్వహిందూ పరిషత్ లేదా ఆలయ ట్రస్ట్ అయినా, నగర ప్రజలు ఈ వివాహాన్ని నిర్వహించడంలో సానుకూలంగా, ఎంతో ఉత్సాహాంగా సహకరించారు.. దీంతో రాంపూర్ వాసులు ప్రజల మధ్య సోదర భావాన్ని చాటారు. పరస్పర సౌభ్రాతృత్వం దెబ్బతినేలా ఒకరినొకరు తప్పుదోవ పట్టించకూడదు’’ అని ఆయన అన్నారు. సివిల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ చేసిన తన కుమార్తె గోల్డ్ మెడలిస్ట్ అని, అబ్బాయి సివిల్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తున్నాడని చెప్పారు.

కాగా, మూడేళ్ల కిందట కేరళలోని ఓ మసీదులో హిందూ జంటకు పెళ్లి జరిపించిన విషయం అప్పట్లో చర్చనీయాంశమయ్యింది. ఏకంగా 1000 మంది అతిథులకు విందులో శాకాహారం వడ్డించారు. అలాగే, వధువుకు కట్నం కింద రూ. 2 లక్షల ఇచ్చారు. బంగారు నగలు కూడా ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారు మసీదు మత పెద్దలు

Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.