యాప్నగరం

తొలిసారి లింగాయత్ పీఠాధిపతిగా ఓ ముస్లిం.. ఫిబ్రవరి 26న బాధ్యతలు

12 శతాబ్దంలో సమాజంలోని కుల వ్వవస్థను, వర్ణ విభేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది బసవేశ్వరుడు. ఆయన స్థాపించిందే లింగాయత ధర్మం.

Samayam Telugu 20 Feb 2020, 11:43 am
హిందువుల్లో ప్రత్యేక వర్గంగా ఉన్న లింగాయత్ మఠానికి ఓ ముస్లిం యువకుడు పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఉత్తర కర్ణాటకలోని గడగ్ జిల్లా అసుతిలో ఉన్న మురుగురాజేంద్ర కోరనేశ్వర శాంతిధామ మఠాధిపతిగా దివాన్ షరియఫ్ రహీమన్సాబ్ ముల్లా (33) ఫిబ్రవరి 26న బాధ్యతలు చేపడతారు. ఈ అంశంపై షరియఫ్ మాట్లాడుతూ... 12వ శతాబ్దంలో హైందవ మతాన్ని సంస్కరించి, సామాజిక న్యాయం, సామరస్యత కోసం ఎంతగానో కృషిచేసిన బసవేశ్వరుడి బోధనలు బాల్యం నుంచి తనను ప్రభావితం చేశాయన్నారు.
Samayam Telugu ling


మురుగురాజేంద్ర మంఠం కలబుర్గి జిల్లా ఖజౌరిలో ఉన్న 350 ఏళ్ల చరిత్ర గలిగిన పురాతన కోరనేశ్వర సంస్థానం అనుబంధం మఠం. చిత్రదుర్గకు చెందిన శ్రీ జగద్గురు మురుగరాజేంద్ర మఠానికి చెందిన 361 అనుబంధ మఠాల్లో ఇది కూడా ఒకటి. కర్ణాటక, మహారాష్ట్ర సహా దేశంలోని ఇతర ప్రాంతాలతో ఈ మఠానికి లక్షలాది మంది అనుచరులు ఉన్నారు.

బసవేశ్వరుడి సిద్ధాంతాలు విశ్వవ్యాప్తమైనవని.. కుల మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన అవకాశాలు కల్పిస్తాం.. సామాజిక న్యాయం, సామరస్యత కోసం కలగన్నారు.. ఆయన అనుచరులుగా అందరికీ మఠం తలుపులు తెరిచే ఉంటాయని ఖజూరీ మఠానికి చెందిన ప్రస్తుత పీఠాధిపతి మురుగురాజేంద్ర కోరనేశ్వర్ శివయోగి పేర్కొన్నారు.

శివయోగి ఉపన్యాసాలతో ప్రభావితమైన షరీఫ్ తండ్రి దివంగత రహీమాన్సాబ్ ముల్లా అసుటి గ్రామంలో మఠం ఏర్పాటు చేయడానికి రెండు ఎకరాల స్థలం విరాళంగా ఇచ్చారు. దీనిపై శివయోగి మాట్లాడుతూ.. అసుటి మఠం గత రెండు మూడేళ్లుగా పనిచేస్తుందని, నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు. బసవ తత్వానికి అంకితమైన షరీఫ్.. ఆ సిద్ధాంతాల ప్రకారం జీవిస్తున్నాడు.. ఆయన తండ్రి బసవేశ్వరుడి అనుచరుడే కాదు లింగాయత్ దీక్షను స్వీకరించాడు.. షరీఫ్ కూడా నవంబర్ 10, 2019 న ‘దీక్ష’ తీసుకున్నట్టు వివరించారు. గత మూడేళ్లుగా లింగాయత్ మతం సిద్ధాంతాలు, బసవేశ్వరుడి ఆదర్శాలు బోధిస్తున్నామని పేర్కొన్నారు.

‘చిన్నప్పటి నుంచి బసవేశ్వరుడి బోధనలు నన్ను ఆకర్షించాయి.. పొరుగున ఉన్న మెనసగి గ్రామంలో ఓ ఫ్లోర్ మిల్ నడుపుకుంటూ ఖాళీ సమయాల్లో బసవన్న ప్రవచనాల గురించి ఉపన్యాసాలు ఇచ్చేవాడిని.. నా సేవలను గుర్తించిన ముగురురాజేంద్ర స్వామీజీ తన శిష్యుడిగా స్వీకరించారు’అని తెలిపారు.

వివాహితుడైన షరీఫ్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కొడుకు ఉన్నారు. కుటుంబ బాధ్యతలు ఉన్నవారు మఠాధిపతిగా బాధ్యతలు చేపట్టడం లింగాయత్‌లలో సర్వసాధారణం. సంసారం బంధనాలతోనే సద్గుతులు పొందుతారని ఈ వర్గం బలంగా నమ్ముతుంది.. సంసారమనే నౌకను నడిపినవాడే సామాజిక, ఆధ్యాత్మిక మార్గంలో సక్రమంగా ప్రయాణిస్తాడని శివయోగి వ్యాఖ్యానించారు. షరీఫ్‌ను మఠాధిపతిగా నియమించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.