యాప్నగరం

Lok Sabha Election: ప్రతిపక్షాల ఐక్యత.. ఆదిలోనే హంసపాదు!

Lok Sabha Election: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టాలంటే.. ప్రతిపక్షాల ఐక్యత తప్పదనే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు చాలా మంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కేసీఆర్, మమతా బెనర్జీ ఆ ప్రయత్నాలు చేయగా.. తాజాగా ఆ బాధ్యతలను బీహార్ సీఎం నితీష్ కుమార్ భుజాలకెత్తుకున్నారు. ఈ క్రమంలోనే బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్‌ను కలిశారు. కానీ.. పట్నాయక్ హైలెట్ ట్విస్ట్ ఇచ్చారు. ఇది ఇప్పుడు టాక్ ఆఫ్‌‌ ది నేషన్‌గా మారింది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 12 May 2023, 6:13 pm

ప్రధానాంశాలు:

  • ప్రతిపక్షాల ఐక్యతకు ఆదిలోనే తిప్పలు
  • ప్రతిపక్షాల ఐక్యత కోసం నితీష్ ప్రయత్నాలు
  • ఊహించని ట్విస్ట్ ఇచ్చిన నవీన్ పట్నాయక్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Patnaik with PM Modi
ప్రధానితో పట్నాయక్
Lok Sabha Election: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురువారం (మే 11న) ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దాదాపు 20 నుంచి 25 నిమిషాల పాటు వీరిద్దరి భేటీ జరిగింది. ఈ సమావేశంలో.. నిర్మాణంలో ఉన్న శ్రీ జగన్నాథ్ విమానాశ్రయం, అసంపూర్తిగా ఉన్న జాతీయ రహదారులు, గ్రామ పంచాయతీల్లో బ్యాంకు శాఖల ప్రారంభంతో సహా.. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన అంశాలను పట్నాయక్ (Naveen Patnaik) లేవనెత్తారు.
మీటింగ్ సంగతి అలా ఉంటే.. ఆ సందర్భంగా నవీన్ పట్నాయక్ కీలక ప్రకటన చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కుండ బద్ధలుకొట్టారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ బిజూ జనతాదళ్ (బీజేడీ) ఎప్పటిలాగే సొంతంగా పోటీ చేస్తుందని నవీన్ పట్నాయక్ వెల్లడించారు. మామూలుగా అయితే.. ఆ ప్రకటనకు పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు. కానీ.. ఇటీవల నవీన్ పట్నాయక్‌ను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ కలిశారు. ఆ భేటీ జరిగిన రెండు రోజులకే పట్నాయక్.. ప్రధానిని కలవడం, ఆ వెంటనే ఈ ప్రకటన చేయడం చర్చకు దారితీసింది.
అటు నితీష్‌తో భేటీపైనా పట్నాయక్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అది మర్యాదపూర్వకమైన భేటీ అని స్పష్టం చేశారు. నితీష్‌ కుమార్‌తో సమావేశం కావడం, ‘థర్డ్‌ ఫ్రంట్‌’ ఆవిర్భవించే అవకాశాలపై నవీన్‌ పట్నాయక్‌ని ప్రశ్నించగా.. ఇప్పటివరకు అయితే ఫ్రంట్ ఏర్పడే అవకాశం లేదన్నారు. అందుకే బీజేడీ ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. జేడీయూ, బీజేడీ మధ్య ఎటువంటి రాజకీయ పొత్తుపై చర్చ జరగలేదని వివరించారు. అలాగే.. ఢిల్లీలో మరే ఇతర నాయకుడిని కలిసే ఆలోచన లేదని చెప్పారు.
నవీన్ పట్నాయక్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో.. అసలు ప్రతిపక్షాల ఐక్యత సాధ్యమా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఒకవేళ ప్రతిపక్షాల ఐక్యత సాధ్యం కాకపోతే.. బీజేపీ ఓడించడం కష్టం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా.. అది చాలా తక్కువ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఐక్యతపై స్పష్టత రాకపోతే.. బీజేపీకి లాభం జరగొచ్చని అంచనా వేస్తున్నారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.