యాప్నగరం

14 సార్లు పోటీ చేశా, ఇక విశ్రాంతి కావాలి..

ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్.. సంచలన ప్రకటన చేశారు. లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని వెల్లడించారు. ఇప్పటికే 14 సార్లు పోటీ చేశానని.. ఇక విశ్రాంతి తీసుకుంటానని తెలిపారు.

Samayam Telugu 11 Mar 2019, 5:39 pm
లోక్ సభ ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీచేయడం లేదని ప్రకటించారు. 14 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని.. ఇక విశ్రాంతి తీసుకుంటానని సోమవారం (మార్చి 11) మీడియాకు ఆయన తెలిపారు. విశ్రాంతి తీసుకునేందుకు ఇదే స‌రైన స‌మ‌యం అని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే.. తమ కుటుంబం నుంచి ఇద్దరు సభ్యులు పోటీ చేస్తారని వెల్లడించారు.
Samayam Telugu Pawan


తన కుమార్తె సుప్రియా సూలే, మనవడు పార్థ పవార్ లోక్‌సభ బరిలో దిగుతున్నారని శరద్ పవార్ తెలిపారు. 2014 సాధారణ ఎన్నికల్లోనూ పవార్ పోటీ చేయలేదు. అందువల్ల ఈసారి కచ్చితంగా పోటీ చేస్తారని పార్టీ నేతలు, కార్యకర్తలు భావించారు. ఈ నేపథ్యంలో ఆయన అనూహ్య నిర్ణయం ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

మహారాష్ట్రలోని మాధ లోక్ సభ నియోజకవర్గం నుంచి శరద్ పవార్.. పలుమార్లు పోటీచేసి గెలిచారు. అయితే.. ఈసారి ఆ స్థానం నుంచి పోటీ చేయడానికి పవార్ ఆసక్తి కనబరచట్లేదని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పవార్ దీనిపై స్పష్టతనిచ్చారు. ఈ స్థానం నుంచి పార్టీ (ఎన్‌సీపీ) నేత విజయ్ సింగ్ మోహిత్ పాటిల్ బరిలో నిలిచే అవకాశాలున్నాయి.

ఓటమి భయంతోనే మాధ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి వెనుకాడుతున్నారా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. 14 సార్లు ఎన్నికల బరిలో నిలిచిన వ్యక్తినా ఈ ప్రశ్న అడిగేది అంటూ ఎదురు ప్రశ్నించారు. పుణే జిల్లాలోని కీలకమైన మావల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి తన మేనల్లుడు, పార్టీ కీలక నేత అజిత్ పవార్ కుమారుడు బరిలో దిగనున్నట్లు శరద్ పవార్ సంతకేతాలిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.