యాప్నగరం

మోదీకి మిత్రపక్షం షాక్.. వ్యవసాయ రంగ బిల్లులపై ఎస్ఏడీ నుంచి తీవ్ర వ్యతిరేకత

బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వానికి ఓ బిల్లు విషయంలో మిత్రపక్షం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. వ్యవసాయ రంగ సంస్కరణల బిల్లులను శిరోమణి అకాళీదళ్ వ్యతిరేకిస్తోంది.

Samayam Telugu 17 Sep 2020, 1:55 pm
కోవిడ్-19 నిబంధనల మధ్య సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అక్టోబరు 1 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ఎన్డీయే సర్కారు పావులు కదుపుతోంది. అయితే, మోదీ సర్కారుకు ప్రధాన మిత్రపక్షం ఊహించని ఝలక్ ఇచ్చింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వ్యవసాయ రంగ సంస్కరణ బిల్లులకు తాము మద్దతు ఇవ్వబోమని శిరోమణి అకాళీదళ్ తేల్చిచెప్పింది. పార్లమెంట్‌లో ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించిన ఎస్ఏడీ.. తన సభ్యులకు విప్‌ జారీ చేసింది. వ్యవసాయ రంగ సంస్కరణ బిల్లులకు తాము పూర్తిగా వ్యతిరేకమని ఆ పార్టీ కుండబద్దలుకొట్టింది.
Samayam Telugu శిరోమణి అకాళీదళ్
Shiromani Akali Dal (SAD)


వ్యవసాయ రంగం కార్పొరేటీకరణ దిశగా అడుగులు వేస్తోన్న కేంద్రం.. దీనికి సంబంధించి ఇటీవల మూడు ఆర్డినెన్స్‌లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రైతు సాధికారికత, నిత్యావసరాల వస్తువులకు గిట్టుబాటు ధరలు, వ్యవసాయ ఉత్పత్తులకు వాణిజ్య పరమైన ప్రోత్సాహాన్ని కల్పించే ఉద్దేశంతో ఈ ఆర్డినెన్స్‌లను తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన బిల్లులను ఈ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవాలని భావించిన కేంద్రం.. వీటిని మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

ఈ బిల్లులపై మిత్రపక్షం నుంచే వ్యతిరేకత వ్యక్తం కావడం గమనార్హం. ఈ బిల్లులను వెంటనే వెనక్కు తీసుకోవాలని ఇప్పటికే పంజాబ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్‌లో రైతులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఈ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా తమ ఎంపీలంతా ఓటు వేయాలని అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఆదేశించారు. లోక్‌సభలో ఎస్ఏడీకి ఇద్దరు సభ్యులు ఉండగా.. ఎస్ఏడీ చీఫ్ భార్య హరిసిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర మంత్రిగా ఉన్నారు.

రాజ్యసభలో ఆ పార్టీకి ముగ్గురు సభ్యులుండగా.. ఒకరిని ఎస్ఏడీ నుంచి బహిష్కరించారు. తనను స్వతంత్ర సభ్యుడిగా గుర్తించాలని కోరుతూ బహిష్కృత నేత సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖరాశారు. రైతుల ప్రయోజాల దృష్యా ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఓటువేస్తానని, ఇప్పటికే వీటిని తాను వ్యతిరేకించానని పేర్కొన్నారు.

పార్టీ నిర్ణయాన్ని ఎస్ఏడీ సభ్యులు సమర్ధిస్తున్నారు. తమ వినతిని బీజేపీ కేంద్ర నాయకత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఎన్డీఏతో తెగదెంపులకు సిద్ధమయ్యారా? అని ఎస్ఏడీ నేత ప్రేమ్ సింగ్ చాద్‌‌మజ్రాను ప్రశ్నించగా... ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

ఇక, ప్రస్తుతానికి ఉత్తర భారతావనికే ఈ బిల్లుల వ్యతిరేక నిరసనలు పరిమితం కాగా, దక్షిణాదికి కూడా తీసుకుని వెళతామని రైతు సంఘాల నేతలు వ్యాఖ్యానించారు. ఇక ఎన్నో ఏళ్లుగా బీజేపీకి నమ్మకమైన భాగస్వామిగా ఉన్న అకాలీదళ్ నుంచి వచ్చిన నిరసనలతో బీజేపీ నేతలు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా, కేంద్రం మాత్రం ఈ బిల్లులు రైతులకు స్నేహపూర్వకమని స్పష్టం చేస్తుండటం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.