యాప్నగరం

‘ఉరి’ తప్పించుకోడానికి విశ్వ ప్రయత్నాలు.. మరోసారి కోర్టుకు నిర్భయ దోషులు

నిర్భయ దోషులును ఫిబ్రవరి 1న ఉరితీయాలని పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీచేయడంతో తీహార్ జైలు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేసే పనిలో నిమగ్నమయ్యారు.

Samayam Telugu 24 Jan 2020, 3:03 pm
ఉరి నుంచి తప్పించుకోడానికి నిర్భయ దోషులు చేయని ప్రయత్నం లేదు. దోషులకు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలుచేయాలని ఇప్పటికే ఢిల్లీలో పాటియాలా హౌస్ కోర్టు రెండోసారి డెత్ వారెంట్ జారీచేసిన విషయం విదితమే. ఉరి నుంచి తప్పించుకోడానికి దోషులు ఇప్పటికే తమకున్న అన్ని అవకాశాలనూ వినియోగించుకున్నారు. తొలుత రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ దాఖలుచేయగా దానిని ఆయన తిరస్కరించారు. న్యాయపరంగా చివరిదైన క్యూరేటివ్ పిటిషన్‌ను దోషులు ప్రయోగించినా అక్కడా చుక్కెదురయ్యింది. దోషులు పలు పిటిషన్లతో సమయాన్ని వృథా చేయడంతో తొలిసారిగా ఇచ్చిన డెత్‌వారెంట్‌ గడువు ముగిసిపోయింది. ఈ నేపథ్యంలోనే మళ్లీ రెండోసారి డెత్‌వారెంట్‌ జారీ చేశారు. ఇప్పుడు దాన్ని కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న దోషులు.. మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
Samayam Telugu nirbhaya


దోషులు పవన్‌, అక్షయ్‌ తరఫున లాయర్ ఏపీ సింగ్‌ పాటియాలా హౌస్‌ కోర్టులో శుక్రవారం పిటిషన్‌ వేశారు. తన క్లయింట్స్ క్యురేటివ్‌, క్షమాభిక్ష పిటిషన్లు దాఖలుచేయడానికి అవసరమైన పత్రాలను ఇవ్వడంలో తీహార్ జైలు అధికారులు జాప్యం చేశారని, అందువల్లే ఆ ఇద్దరూ క్షమాభిక్ష పిటిషన్‌ వేయడంలో ఆలస్యమైందని ఆరోపించారు. కాగా, ఈ పిటిషన్‌‌పై ఢిల్లీ కోర్టు శనివారం విచారణ చేపట్టనుంది. డెత్‌ వారెంట్‌ జారీ అయిన తర్వాత అక్షయ్ సింగ్, పవన్‌లు ఇప్పటి వరకు క్యురేటివ్‌, క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేయలేదు. గతంలో పవన్‌ క్షమాభిక్ష పిటిషన్‌ వేసినట్లు వార్తలు వచ్చాయి.. కానీ అవి అసత్యమని తాను ఏ పిటిషన్‌ వేయలేదని అన్నాడు.

ముకేశ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. పిటిషన్‌ వచ్చిన నాలుగు రోజుల వ్యవధిలోనే ఆయన తిరస్కరించి రికార్డు సృష్టించారు. మరోవైపు, నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుచేయడంలో జాప్యం జరుగుతోందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరణ దండన అమలుపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్‌ వేసింది. ఉరిశిక్ష పడిన నేరస్థులు తమకు ఉన్న న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకునేందుకు ఉన్న సమయాన్ని కుదించాలని కేంద్రం కోరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.