యాప్నగరం

నిర్బయ దోషి వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం.. ‘ఉరి’ తప్పించుకోడానికి ఎత్తుగడ?

ఏడేళ్ల కిందట రాజధాని ఢిల్లీలో నిస్సహాయంగా ఉన్న యువతిపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడి, ఆమె మరణానికి కారకులైన నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే.

Samayam Telugu 20 Feb 2020, 11:32 am
నిర్బయ దోషులకు ఢిల్లీ కోర్టు మూడోసారి డెత్ వారెంట్ జారీచేసిన విషయం తెలిసిందే. నలుగురు దోషులనూ మార్చి 3న ఉదయం 6 గంటలకు తీహార్ జైల్లో ఉరితీయనున్నారు. ఈ నేపథ్యంలో నిర్బయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేగింది. తన సెల్‌లోని గోడకు తల బాదుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన సిబ్బంది అతడిని వైద్యం కోసం హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు.
Samayam Telugu vinay-sharma


అయితే, ఫిబ్రవరి 16న ఈ సంఘటన జరిగినట్టు సమాచారం. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వినయ్‌ శర్మ జైలు గది గోడలకు తల బాదుకుని గాయపర్చుకున్నాడు. అంతటితో ఆగకుండా ఊచల మధ్య చెయ్యి ఇరికించుకుని విరగొట్టుకోవాలని యత్నించినట్లు జైలు వర్గాల సమాచారం. ఈ ఘటనలో అతడికి స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు.

ఉరిశిక్ష నుంచి తప్పించుకోడానికి దోషులు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. మరణశిక్ష నుంచి బయటపడటానికి దారులన్నీ మూసుకుపోవడంతో దోషి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మార్చి 6న ఉరి అమలుచేయనుండటంతో వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలోనూ వినయ్ శర్మ ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

రెండు రోజుల కిందటే వినయ్ శర్మ నిరాహార దీక్షకు చేపట్టినట్టు జైలు వర్గాలు కోర్టుకు తెలిపాయి. వినయ్ శర్మ ఆహారం తీసుకోవడంలేదని చెప్పడంతో చట్టపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ట్రయల్ కోర్టు తీహార్ జైలు అధికారులకు స్పష్టం చేసింది. వినయ్ శర్మ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ, వినయ్ శర్మ మానసిక వ్యాధికి గురయ్యాడని, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న అతడికి ఉరి అమలు చేయడం కష్టమని తెలిపారు.

గతంలోనూ వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం చేశాడు. తీహార్ జైల్లోనే 2016 ఆగస్టు 24న రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇనుప గ్రిల్స్‌కు వస్త్రంతో ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన వినయ్ శర్మను సిబ్బంది గమనించి అడ్డుకున్నారు. అనంతరం అతడిని దీన్ దయాళ్ ఉపాధ్యాయ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందజేశారు. ఆత్మహత్యకు ముందు వినయ్ శర్మ మానసిక కుంగుబాటుకు వాడే ఔషధాలను అధిక మోతాదులో తీసుకున్నట్టు తేలింది.

నిర్బయ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామ్ సింగ్ 2013 మార్చిలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. తీహార్ జైల్లోనే అతడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.