యాప్నగరం

హైకోర్టులో సచిన్ పైలట్‌కు ఊరట.. రసకందాయంలో రాజస్థాన్ రాజకీయం

Sachin Pilot: రాజస్థాన్ రాజకీయాలు మళ్లీ రసకందాయంలో పడ్డాయి. ఆ రాష్ట్ర హైకోర్టులో రెబల్ నేత సచిన్ పైలట్‌కు ఊరట లభించింది. అశోక్ గెహ్లాట్ బలనిరూపణ హాట్ టాపిక్‌గా మారింది.

Samayam Telugu 21 Jul 2020, 4:36 pm
రాజస్థాన్ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌కు ఆ రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. సచిన్ పైలట్ సహా 19 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంపై జులై 24 వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని అసెంబ్లీ స్పీకర్‌కు సూచించింది. ఈ అంశంపై వాదనలు పూర్తయ్యాయని తెలిపిన హైకోర్టు.. తీర్పుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. స్పీకర్ ముందు వాదనలు వినిపించాలనే అభిప్రాయాన్ని కూడా కోర్టు తోసిపుచ్చింది.
Samayam Telugu సచిన్ పైలట్
Sachin Pilot


ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బలనిరూపణ చేసుకోవాల్సిన వేళ హైకోర్టు తీర్పుతో రాజస్థాన్ రాజకీయాలు మరోసారి రసకందాయంలో పడ్డాయి. 19 మంది రెబల్ ఎమ్మెల్యేలపై వేటు వేయించి తేలిగ్గా పని పూర్తి చేసుకోవాలని అశోక్ గెహ్లాట్ వర్గం భావిస్తుండగా.. కోర్టు జులై 24 వరకు బ్రేకులు వేసింది. అశోక్ గెహ్లాట్ ఒకవేళ ఈలోగా బలనిరూపణకు వెళ్లాల్సి వస్తే చిక్కులు తప్పవు. లేనిపక్షంలో అప్పటివరకు ఆగడానికి గవర్నర్ ఆమోదిస్తారా అనేది మరొక ఆసక్తికర అంశం.

ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అత్యవసరంగా కేబినెట్ సమావేశం ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. మంగళవారం (జులై 21) సాయంత్రం సీఎం అశోక్ గెహ్లాట్ నివాసంలో ఆయన అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ భేటీలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.

రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ నోటీసులను సవాల్ చేస్తూ పైలట్ సహా 19 మంది రెబల్ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రాష్ట్ర హైకోర్టు రెండో రోజైన మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇంద్రజిత్ మహంతీ, ప్రకాశ్ గుప్తాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు, ప్రభుత్వాన్ని కూల్చడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలకు మిమ్మల్ని ఎందుకు అనర్హులుగా ప్రకటించకూడదంటూ సచిన్ వర్గాన్ని స్పీకర్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే.. సభ సమావేశం కానప్పుడు మమ్మల్ని అనర్హులుగా ఎలా ప్రకటిస్తారని పైలట్ వర్గం ఎదురు ప్రశ్నిస్తోంది. రాజ్యాంగబద్దమైన ఇలాంటి సునిశిత అంశాలపై కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో చూడాలి.

రెబెల్ సభ్యులను అనర్హులుగా ప్రకటించవచ్చా అనే అంశంపై కోర్టు ఇచ్చే ఉత్తర్వులు.. ఈ వారంలో జరగవచ్చు అనుకొంటున్న అసెంబ్లీ సమావేశాలపైన, సీఎం అశోక్ గెహ్లాట్ ఎదుర్కోనున్న ఫ్లోర్ టెస్ట్‌ పైనా ప్రభావం చూపవచ్చు. సభలో బలపరీక్షను ఎదుర్కోవడానికి తాను సిద్ధమేనని ముఖ్యమంత్రి గెహ్లాట్ ఇప్పటికే గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాకు తెలిపారు.

Also Read: కోట్ల కంపెనీకి కుమార్తెను రాణిని చేసిన తండ్రి

Don't Miss: పాన్ మసాలా కోసం పారిపోయిన కరోనా రోగి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.